Begin typing your search above and press return to search.

ఇదేం కౌంటింగ్: భారత్ ను చూసి అమెరికా నేర్వాల్సిందే!

By:  Tupaki Desk   |   6 Nov 2020 4:30 PM GMT
ఇదేం కౌంటింగ్: భారత్ ను చూసి అమెరికా నేర్వాల్సిందే!
X
నియంతల పాలనలో ఉన్న ఉత్తరకొరియాకు.. ప్రజాస్వామ్యంలో ఉన్న అమెరికా, భారత్ లకు చాలా తేడా ఉంటుంది. నియంతలు వాళ్లుచెప్పిందే రాజ్యం.. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పిందే వేదం.. ప్రజాభిప్రాయానికి విలువ. నియంతలు ఎంతో మందిని చంపినా.. ప్రజలను బానిసలను చేసినా.. వారిని చంపినా అడిగే వారు లేరు.కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే కింగ్ మేకర్స్.. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది.

ఏ దేశంలో అయినా ఎన్నికల ప్రక్రియ సజావుగా..సరళంగా జరగాలి. ఈ విషయంలో మన భారత్‌ను చూసి అమెరికా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాజాగా అమెరికా ఎన్నికల కౌంటింగ్ చూశాక అందరూ హితవు పలుకుతున్నారు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న గందరగోళాన్ని చూస్తుంటే ఇది చెప్పక తప్పదు.

భారత్‌లో మాత్రం ఓటరు లిస్టు ఆధారంగానే ఎన్నికలు జరుగుతుంటాయి. పోలింగ్‌ సమయం దాటితే కూడా క్యూలో ఉన్నవారికే తప్ప కొత్తవారిని అనుమతించరు. కానీ.. అమెరికాలో ఏకరీతి బ్యాలెట్‌ విధానం కూడా లేదు. బ్యాలెట్‌ పేపర్లను పోస్టల్‌ ఓటింగ్‌ కోసం ఓటర్లు కొన్ని రోజుల ముందు తీసుకోవచ్చు. అవి చిరిగిపోవడం, చోరీకి గురికావడం వంటి ఇబ్బందులూ తలెత్తుతుంటాయి. భారత్‌లో దేశం మొత్తం ఒకే విధానంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ‘ఎలక్షన్‌ డే’ రోజు మాత్రమే ఓటర్లు ఓట్లు వేస్తారు. ఓటును ఎన్నికల సంఘం విధించిన గడువులోపే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రపంచంలోనే అతి పురాతన దేశం అమెరికా. అమెరికాలోని ‘ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌’ ఎన్నికలు నిర్వహించదు. ఎన్నికల ప్రచారాల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుని, రాజకీయ పార్టీల నిధుల సేకరణ, ఖర్చులు వంటి అంశాలను మాత్రమే నియంత్రిస్తుంది. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే అమెరికా అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేట్లు ప్రభుత్వ నేతలు అవకతవకలకు పాల్పడే అవకాశలూ లేకపోలేదు. భారత్‌లో ఎన్నికల సంఘమే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుంది. అంతేకాదు.. అమెరికాలో జాతీయ ఓటర్ల జాబితా అంటూ ఏదీ లేదు. ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవడం కోసం పౌరులు దరఖాస్తు చేసుకుంటే స్థానిక అధికారులే తమ ప్రాంతంలో ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. ఈ ప్రక్రియలో కొందరు పౌరుల పట్ల గతంలో వివక్ష కొనసాగింది. రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలు ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

అమెరికాలో ‘ఎలక్షన్‌ డే’ రోజు ‘ప్రభుత్వ సెలవు దినం’ కూడా ఉండదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు. భారత్‌లో ఎన్నికల రోజున ప్రభుత్వ సెలవు దినం ఉంటుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 15 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ ముగిసేవరకు కొన్ని రోజులు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓట్లు వేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రోజున కొన్ని గంటల్లోనే అధిక శాతం సీట్లలో గెలుపెవరిదో తేలిపోయింది. అందుకే.. చాలా మంది నిపుణులు భారత్‌ను చూసి అమెరికాలోని ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.