Begin typing your search above and press return to search.

కుక్క‌తోక‌ను ప‌ట్టుకొని గోదారి ఈద‌డం..ప‌వ‌న్‌ తో పొత్తు ఒక‌టే

By:  Tupaki Desk   |   16 Jan 2020 7:00 PM IST
కుక్క‌తోక‌ను ప‌ట్టుకొని గోదారి ఈద‌డం..ప‌వ‌న్‌ తో పొత్తు ఒక‌టే
X
ఊహించిన‌ట్లుగానే జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. ఈ విష‌యంలో అంద‌రి దృష్టి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప‌డింది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ప్ర‌ధానంగా టార్గెట్ చేసింది వైసీపీనే కాబ‌ట్టి. ఆ పార్టీ స్పంద‌న స‌హ‌జంగానే ఆస‌క్తిక‌రం. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి ఈ దోస్తీపై స్పందించారు. బీజేపీ-జనసేన పార్టీలు గత ఎన్నికల్లో పోటీ చేశాయ‌ని గుర్తు చేశారు. ఆ రెండూ ఓట్లు - సీట్లు ప్రభావితం చేయలేని పార్టీలని ఎద్దేవా చేశారు.

రాజకీయ కూటములు రాజకీయాల్లో సర్వసాధారణమ‌ని అంబ‌టి కొట్టిపారేశారు. ``ఎన్నికల సమయంలో ఇది సాధారణం. దీనిపై మేం స్పందించాలి అనుకోలేదు. అయితే, వారు చేసిన ఆరోపణలు మీద స్పందిస్తున్నాం. 7 మాసాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. దానిపై స్పందిస్తున్నాం. రాజకీయాల్లో - వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి జనసేన పార్టీ పెట్టాడు.-ఒక్కో లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివితే ఒక విధంగా భావజాలం అనిపిస్తోంది. మరి ఆయనకు ఒక్కో విధంగా అనిపించడంలో తప్పు లేదు. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కుక్కతోక పట్టుకుని గోదారి ఈదుతానంటే మాకేం నష్టం లేదు` అని ఎద్దేవా చేశారు.

ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ఇచ్చిన ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అని మోడీపై ధ్వజమెత్తిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఇవాళ జీడిపప్పు - కిస్ మిస్ తో తాజా లడ్డూలు పంపారా అని జ‌న‌సేనాని తీరుపై అంబ‌టి ఎద్దేవా చేశారు. ``ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే ఆయన హోదా అడక్కుండా బేషరతుగా ఎందుకు కలసిపనిచేస్తానని హామీ ఇచ్చారు? అదేమంటే వైయస్సార్ కాంగ్రెస్ ను అడగమంటున్నాడు...మోడీతో కలిసిన నువ్వు ఏమి చేస్తావ్‌? ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీ - టీడీపీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తో దూరంగా ఉన్నట్లు నటించారు. అనంత‌రం వామపక్షాలతో కలిశారు.ఇలా...రాజకీయ స్థిరత్వం లేని ప‌వ‌న్ ఒక పార్టీతో దీర్ఘకాలం ఉన్నారా?` అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ విఫలం అయింది లేదా సఫలం అయింది అనేది 7 నెలల్లో నిర్ణయిస్తారా? అని అంబ‌టి ప్ర‌శ్నించారు.

ఈ 7 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ‌ని అదే వైసీపీ ప్ర‌భుత్వ వైఫల్యమా అని అంబ‌టి ప్ర‌శ్నించారు. అలా విమర్శించడం విజ్ఞత కాదు అని అన్నారు. ``మీరు కలవాలంటే కలవండి..ఎన్ని పార్టీలు కలిసినా మేము భయపడం. ఒంటరిగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చాం..చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సాయం చేయడానికి మీ కూటమి పెట్టారా? గతంలో ఎన్నో కూటములు పెట్టారు...అయినా మాకు ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా మీకు జగనే టార్గెట్. చంద్రబాబు- సుజనా - సీఎం రమేష్ లాంటి వాళ్ళని బీజేపీలోకి పంపారు..ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతు` అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. వామపక్షాలు ప‌వ‌న్‌ నిలకడలేని వ్యవహారాన్ని గమనించాలని కోరారు.