Begin typing your search above and press return to search.

బాబు జైలుకు పోవాల్సిందేన‌ట‌..ఎవ‌రు చెప్పారంటే..!

By:  Tupaki Desk   |   2 Jan 2020 10:40 PM IST
బాబు జైలుకు పోవాల్సిందేన‌ట‌..ఎవ‌రు చెప్పారంటే..!
X
ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కేంద్రంగా మ‌రోమారు వివాదాస్ప‌ద అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. వైసీపీ ఎమ్మెల్యే - పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంశంపై బాబుపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. దీనికి మ‌ద్ద‌తుగా వీడియో ప్రజంటేషన్ ఇచ్చిన వైసీపీ నేత అమరావతిలో ఏం జరిగిందనే విషయంలో.. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ పై ఆధారాలతో సహా విజువల్‌ ను ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు.

లింగమనేనికి లబ్ది చేకూర్చి ఆయన గెస్ట్ హౌస్‌ ను తీసుకున్నారని వైసీపీ నేత ఆరోపించారు. మొత్తం 4069.95 ఎకరాలు రాజధానిలో కొనుగోలు చేశారని.. ఇన్నర్ రింగ్ రోడ్‌ కు కూడా భూములకు అనుకూలంగా కొనుకున్నారని వారు తెలిపారు. 800 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారని.. ఇందులో 60 మంది హైదరాబాద్‌ కు చెందిన వారు కూడా ఉన్నారని - రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తాము ప్రజలకు తెలియజేస్తున్నామని వివ‌రించారు. ‘రాజధాని ప్రాంతంలో అసైన్డు భూముల కొనుగోలు - క్విడ్‌ ప్రోకో ఒప్పందాలు - రాజధాని ప్రకటన విషయంలో గందరగోళం - ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో జరిగిన అన్యాయం - లింగమనేనికి సంబంధించిన భూములకు సరిగ్గా పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడం’ వంటివి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నామ‌ని అంబ‌టి తెలిపారు. ఇన్ని అక్ర‌మాల‌కు పాల్ప‌డిన చంద్ర‌బాబు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి పైనా ఆయ‌న కామెంట్లు చేశారు. ఇప్పుడు భువ‌నేశ్వ‌రికి క‌లుగుతోంది రైతుల ప్రేమా లేదంటే బినామీ భూములు మీద ప్రేమా?మీ తండ్రి ఎన్టీఆర్‌ కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచినప్పుడు... ఎన్టీఆర్ ఊరు ఊరు తిరుగుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు మీకు ఎందుకు జాలి కలగలేదు?సమైక్యాంధ్ర కోసం ఎంతో మంది చనిపోయారు. అప్పుడు ప్రేమ ఎందుకు కలగలేదు?చంద్రబాబు ప్రచార పిచ్చి వలన పుష్కరాల షూటింగ్‌ లో 30 మంది చనిపోయారు. అప్పుడెందుకు వారిపై ప్రేమ క‌ల‌గ‌లేదు? బాబు హ‌యాంలో గిట్టుబాటు ధర లేక రైతులు చనిపోయారు. అప్పుడు ఎందుకు భువనేశ్వరికి రైతుల మీద ప్రేమ కలగలేదు? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.