Begin typing your search above and press return to search.

అక్క‌డ గెల‌వ‌క‌పోతే.. టీడీపీకి బ‌తుకుండ‌దా!

By:  Tupaki Desk   |   17 Aug 2017 4:54 PM IST
అక్క‌డ గెల‌వ‌క‌పోతే.. టీడీపీకి బ‌తుకుండ‌దా!
X
నంద్యాల ఉప ఎన్నిక‌ను టీడీపీ చంద్ర‌బాబు ఎందుకంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దాదాపు ఆరుగురు మంత్రులు, పాతిక మందికిపైగా ఎమ్మెల్యేల‌ను ఎందుకు అక్క‌డ మోహ‌రించారు? ఓ చిన్న ఉప ఎన్నిక‌ను ఎదుర్కొనేందుకు ఎందుకు అంత‌గా ప్ర‌యాస ప‌డుతున్నారు. ప్ర‌జాధ‌నాన్ని కోట్ల‌కు కోట్లు అభివృద్ది పేరుతో నంద్యాల‌లో ఎందుకు కుమ్మ‌రిస్తున్నారు? అని అడిగితే.. ఒకే ఒక్క స‌మాధానం ఇప్పుడు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబటి రాంబాబు.. అదేంటంటే.. నంద్యాల‌లో గెల‌వ‌క‌పోతే.. ఇక బ‌తుకు లేద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌!

అందుకే లేనిపోని అంశాల‌తో ప్ర‌చారం చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను త‌న ప‌క్షం తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట బాబు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు అనుకూలంగా ఉన్న ఓ ప్ర‌తిక‌ - ఛానెల్ కూడా ఇప్పుడు లేనిది ఉన్న‌ట్టు రాస్తోంద‌ని, ప్ర‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు అంబటి గురువారం ఆయన హైద‌రాబాద్‌ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎల్లో మీడియా వైసీపీపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తోంద‌న్నారు. నంద్యాలలో టీడీపీ గెలవకుంటే బతుకు లేదని భావిస్తున్నార‌ని, అందుకే బ‌లంగా ఉన్న వైసీపీని దెబ్బ‌తీసేందుకు కుట్ర‌లు ప‌న్నార‌ని అన్నారు.

ఇక‌, నంద్యాల‌లో చంద్ర‌బాబు ఓడితే.. ఆయ‌కు పొలిటిక‌ల్‌ గా ఫ్యూచ‌ర్‌ పై దెబ్బ‌ప‌డుతుంద‌ని బావించే ఇలా విష ప్ర‌చారానికి దిగింద‌ని అన్నారు. చంద్రబాబు అండ లేకుండా బతకలేమని పచ్చ మీడియా భావిస్తోందని అంబటి మండిపడ్డారు. నిన్న బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకొన్న గంగుల ప్రతాపరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు కొన్ని చానళ్లు - పత్రికల ద్వారా జరిగిన ప్రచారం అవాస్తవమన్నారు. ఆయన తమ పార్టీలో చేరనే లేదని, అలాంటిది గంగుల ప్రతాపరెడ్డి వైసీపీని వీడటం అనేది సరికాదన్నారు. వాస్తవాలు ప్రచురించే ధైర్యం పచ్చ పత్రికలు - ఛానల్స్‌ చేయడం లేదన్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీల‌ను కేంద్రం మ‌రో ప‌దేళ్ల‌పాటు పొడిగిస్తూ.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదేశాలు జారీ చేశార‌ని, ఇప్పుడు మ‌నం హోదాను కోల్పోతున్నామ‌ని, దీనిపై ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు స్పందించాల‌ని సూచించారు. ప్రత్యేక హోదా పొందకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పటికైనా హోదా కోసం చంద్రబాబు కృషి చేయాలని తాము కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.