Begin typing your search above and press return to search.

గ్రీన్ ఎన‌ర్జీలోకి రిల‌య‌న్స్‌ .. రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న అంబానీ !

By:  Tupaki Desk   |   25 Jun 2021 7:33 AM GMT
గ్రీన్ ఎన‌ర్జీలోకి రిల‌య‌న్స్‌ ..  రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న అంబానీ !
X
ఆసియా కుబేరుడు , ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశంలోని అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం తాజాగా గురువారం జరిగిన విషయం తెలిసిందే. టెలికాం రంగంల దూసుకెళ్తున్న అంబానీ, సౌరశక్తిలో టాటా, ఆదానీ వంటి బడా వ్యాపారవేత్తలను దాటుకుని వెళ్లేందుకు వ్యూహాలు రచించారు. ఈ సంస్థ వ్యాపార అభివృద్ధికి ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా భారీ ప్రణాళికలు ఆవిష్కరించింది. వీటి ప్రకారం పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయబోతోంది. సోలార్‌ సెల్స్‌ తయారీ ప్లాంట్లు, విద్యుత్‌ నిల్వ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యుయెల్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌, హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

2030 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను, కార్బన్‌ ఫైబర్‌ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం రిలయన్స్‌ ఆదాయాల్లో దాదాపు 60 శాతం, హైడ్రోకార్బన్‌ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది. ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీ, గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్‌ల‌తో ముకేశ్ అంబానీ పోటీ ప‌డ‌నున్నారు. అయితే, ఇప్ప‌టికే విద్యుత్ రంగంలో ప‌ట్టు క‌లిగి ఉన్న గౌతం ఆదానీ, ఎల‌న్ మ‌స్క్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కోవాల్సి రావ‌చ్చున‌ని భావిస్తున్నారు. గ్రీన్ ఇన్షియేటివ్ ఆఫ్ వాల్యూ చైన్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు సంబంధించి ఫ్యూచ‌ర్ టెక్నాల‌జీ, పార్ట‌న‌ర్ షిప్‌ల మీద అద‌నంగా రూ.15 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు.

2035 నాటికి పూర్తిగా కర్బన్‌ ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్‌ గత సంవత్సరమే ఓ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా వ్యూహాలు, మార్గదర్శక ప్రణాళికలను మీ ముందు ఉంచుతున్నట్లు నిన్న తెలిపింది. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని, ఇందులో భాగంగా నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నామని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ఈ నాలుగు గిగా ఫ్యాక్టరీలకు అవసరమైన పరికరాల తయారీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా రూఫ్‌టాప్‌ సోలార్, గ్రామాల్లో సౌర విద్యుత్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటు రూపంలో ఉండనుంది. భార‌త్‌తోపాటు ప్ర‌పంచ ముఖ‌చిత్రంపై పూర్తి స్థాయిలో క‌ర్బ‌న ఉద్గారాలను నియంత్రించ‌డమే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది రిల‌య‌న్స్‌. ఇందుకోసం దేశంలోనే ఉత్త‌మ నిపుణుల‌తో క‌లిసి న్యూ ఎన‌ర్జీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.