Begin typing your search above and press return to search.

చీరాల‌పై ఆమంచిదే పైచేయి! ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   8 Oct 2020 8:06 PM IST
చీరాల‌పై ఆమంచిదే పైచేయి! ఏం జ‌రిగిందంటే!
X
రాజ‌కీయాల్లో జంపింగ్ నేత‌ల కార‌ణంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో టీడీపీలోనూ ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. నేత‌ల‌ను తీసుకున్న కార‌ణంగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ ఆధిప‌త్యం పెరిగి.. వివాదాల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్టు అయింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వెళ్లలేక పోయారు. కానీ, ఇప్పుడు ఇదే స‌మ‌స్య వ‌స్తే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒకింత వ్యూహంతోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా ప్ర‌కాశం జిల్లాలోనూ ఇలాంటి స‌మ‌స్య కొన్నినెల‌లుగా వైసీపీలో పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతూనే ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చీరాల నుంచి విజ‌యం సాధించిన టీడీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌.. క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి.. త‌న కుమారుడి కోసం అంటూ.. వైసీపీకి మ‌ద్ద‌తుగా మారారు. త‌న కుమారుడిని నేరుగా పార్టీలో చేర్చారు. ఇక్క‌డ ఆయ‌న రెండు సీట్ల‌లో ఆధిప‌త్యం కోరుతున్న‌ నేప‌థ్యంలో వివాదానికి దారితీసింది. త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీరాల‌ను.. త‌న‌కే కేటాయించాల‌ని, అద్దంకి ఇంచార్జ్ సీటు ను త‌న కుమారుడు వెంక‌టేష్‌కు ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌తిపాదించారు.

దీంతో త‌న ప‌రిస్తితి ఏంట‌ని ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వివాదానికి దిగారు. ఈ క్ర‌మంలో ప‌రుచూరుకు వెళ్లాల‌ని పార్టీ అధిష్టానం ఆమంచి ని ఆదేశించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. త‌న‌కు అది వ‌ద్ద‌ని.. చీరాలే కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం... త‌ర్వాత పార్టీ ముఖ్యుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి రంగంలోకి దిగి.. అధ్య‌యనం చేయ‌డంతో ఇప్పుడు ప‌రిస్థితి మారింది. చీరాల‌ను ఆమంచికే ఉంచేసి.. ప‌రుచూరు, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక‌టి ఎంచుకునే అవ‌కాశం.. క‌ర‌ణం కుమారుడికి ఇవ్వాల‌ని, అదేస‌మ‌యంలోకుటుంబానికి ఒక టికెట్ మాత్ర‌మే ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే ఈ మూడేళ్లు ఇలా గ‌డ‌వ‌నిచ్చి.. ఎన్నిక‌ల నాటికి చీరాల టికెట్‌ ను ఆమంచికే ఇచ్చే వ్యూహంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో అటు క‌మ్మ‌, ఇటు కాపు సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేయ‌డంతోపాటు.. అద్దంకి ఎలాగూ.. క‌ర‌ణానికి కొట్టిన పిండే కాబ‌ట్టి.. అక్క‌డ లేదంటే.. ప‌రుచూరులో టీడీపీకి చెక్ పెట్టేందుకు ఉప‌యోగించుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.