Begin typing your search above and press return to search.

ప్రాణాంతాక కరోనా అప్పుడే హైదరాబాద్ కు వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:07 AM GMT
ప్రాణాంతాక కరోనా అప్పుడే హైదరాబాద్ కు వచ్చేసిందా?
X
డ్రాగన్ దేశానికి దడ పుట్టిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ మహానగరంలోకి ఎంటర్ అయ్యిందా? అన్న సందేహాన్ని కలిగించే ఉదంతాలు తాజాగా చోటు చేసుకున్నాయి. అల్లంత దూరాన ఉన్న చైనాలో కరోనా కారణంగా కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. చైనా నుంచి ఈ వైరస్ దిగుమతి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. ప్రపంచం కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకర వైరస్ రావటం అంత కష్టమైన విషయం కాదన్నది నిజం. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రికి నలుగురు కరోనా వైరస్ అనుమానం తో చేరటం కలకలం రేగుతోంది.

అయితే.. ఈ నలుగురిలో ఒకరికి వైరస్ లేదని తేల్చి చెప్పటంతో పాటు.. వారిని ఇంటికి పంపించారు. మిగిలిన ముగ్గురిని మాత్రం ఐసోలేటెడ్ వార్డులో ప్రత్యేకం గా ఉంచారు. ఈ నలుగురు చైనా.. హాంకాంగ్ నుంచి ఇటీవల నగరానికి వచ్చిన వారు కావటం గమనార్హం. చైనా నుంచి హైదరాబాద్ కు వచచిన యువ వైద్యుడు జలుబు.. దగ్గు లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రి లో చేరారు. ఆ యువకుడి నుంచి నమూనాలను సేకరించిన ఫుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపారు. ఇదంతా శుక్రవారం జరిగింది. అయితే.. అతడిలో కరోనా వైరస్ లేదని తేలింది.

ఇదే తీరులో మరో ముగ్గురు ఆదివారం హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఈ నలుగురిని ఆసుపత్రిలో చేర్చుకొని.. వేర్వేరు గదుల్లో వైద్య పరీక్షలు జరుపుతూ జాగ్రత్త గా పరిశీలిస్తున్నారు. ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు.. జ్వరం.. దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయి. సదరు వ్యక్తి శాంపిల్స్ ను సేకరించిన ఫూణెకు రోడ్డు మార్గంలో ప్రత్యేక వాహనం లో పంపారు. ఫలితాలు ఈ రోజు(సోమవారం) రానున్నాయి.

మీడియాలో కరోనా వైరస్ గురించి ప్రసారమవుతున్న కథనాల నేపథ్యంలో భయాందోళనలతో..ముందస్తు జాగ్రత్తలతో ఆ నలుగురు వారంతట వారే స్వచ్ఛందంగా ఆసుపత్రి లో చేరినట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ శాంపిళ్లు పంపిన వారి పరిస్థితి విషమించినా.. వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాల్సి వచ్చినా గాంధీకి తరలించటానికి ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాట్లు చేశారు. మరోవైపు చైనా.. హాంకాంగ్ తదితర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే.. వారికి విడిగా చికిత్సను అందించటంతో పాటు.. వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పరిశీలనలో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

కరోనా వైరస్ సందేహం ఉన్న వారికి పరీక్షలు జరిపి.. ఫలితాలు వచ్చే వరకూ వారిని.. వారి కుటుంబ సభ్యుల్ని.. సన్నిహితంగా మెలిగే వారిని ఇంటికే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాధి లక్షణాలు కనిపించటానికి రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉందని.. ఈలోపు లక్షణాలు లేవని బయట కు తిరిగితే ఈ వైరస్ పెద్ద ఎత్తున వ్యాపించే వీలుంది. అందుకే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు కానీ.. కరోనా ముప్పు మాత్రం పొంచి ఉందని మాత్రం చెప్పక తప్పదు.