Begin typing your search above and press return to search.

డామిట్‌.. బాబుకు మ‌చ్చ‌.. పీఏ చెరువు క‌బ్జా!?

By:  Tupaki Desk   |   6 Sep 2021 9:37 AM GMT
డామిట్‌.. బాబుకు మ‌చ్చ‌.. పీఏ చెరువు క‌బ్జా!?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి అవినీతికి పాల్ప‌డ్డారా? టీడీపీ అధికారంలో ఉన్న స‌మ యంలో బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో చెరువు భూమి మూడు ఎక‌రాల‌ను ఆయ‌న ఆక్ర‌మించాడా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వెలుగు చూసిన ఈ విషయం.. టీడీపీ లో సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. దాదాపు 40 ఏళ్లుగా చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విజ యం ద‌క్కించుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఇచ్చారే త‌ప్ప‌.. తీసుకున్న‌ది ఏమీ లేదు.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు చెరువ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. సర్వే నం.226/2తో 3.58 ఎకరాల విస్తీర్ణం కలిగిన వెంకటప్పా చెరువును టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి మ‌నోహ‌ర్ స‌హా మ‌రికొంద‌రు ఆక్ర‌మించుకున్నార‌నేది ఆరోప‌ణ‌. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే మనోహర్‌ అండ ఉండడల‌తో తప్పుడు సర్వే నంబర్లతో ఈ చెరువును లే అవుట్‌గా మార్చేశారని అంటున్నారు. కుప్పం సమీపంలోని సీనేపల్లి గ్రామ పంచాయతీలో ప్లాన్‌ అప్రూవల్‌ చేసుకోవడం.. ఆ ప్లాన్‌తో కుప్పంలోని సర్వే నం.226/2లోని చెరువులో నిర్మాణం చేసుకోవడం.. ఇలా టీడీపీ నేతలు, మనోహర్‌ సన్నిహితులు మతిన్‌ హజరత్, నజీర్, మణి బినామీ పేర్లతో చెరువును ప్లాట్లుగా చేసి అమ్మేశార‌ని తెలుస్తోంది.

నిజ‌మేనా?

ప్ర‌స్తుతం ఉన్న రికార్డుల‌ను బ‌ట్టి.. `ఈ విష‌యం` నిజ‌మేన‌ని తెలుస్తోంది. అప్పటి కుప్పంలో ప‌నిచేసిన రెవెన్యూ అధికారులు కూడా స‌హ‌క‌రించార‌ని అంటున్నారు. దీంతో స్థానికులు, రైతులు అప్పటి మదనపల్లె్ల సబ్‌ కలెక్టర్‌ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్‌ 2017 ఆగస్టులో కుప్పం వచ్చి కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు. అక్కడికక్కడే సర్వేకి ఆదేశించి.. హద్దులు ఏర్పాటు చేస్తుండగా.. అదే సమయంలో సదరు సబ్‌కలెక్టర్‌పై ఒత్తిళ్లు వ‌చ్చాయ‌ని.. దీంతో ఆయ‌న ప‌క్క‌కు త‌ప్పుకొన్నార‌ని ఇక్క‌డి వారు ఆరోపిస్తున్నారు.

పైగా న్యాయ‌పోరాటం!

వాస్తవానికి అప్పట్లో చెరువు ఆక్రమణలను రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదనేది స్థానికుల ఆరోప‌ణ‌. అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చకుండా కాలయాపన చేశారని అంటున్నారు. ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లేలా కొందరు అధికారులు జాప్యం చేశారని అంటున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తున్నామ‌ని, చెరువును రక్షించుకునేందుకు రెవెన్యూ వారితో కలిసి ఇరిగేషన్‌ శాఖాపరంగా చర్యలు చేపడుతుంద‌ని అధికారులుకూడా చెబుతున్నారు.

బాబుకు ఇబ్బందే!

ఈ ప‌రిణామం.. చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా చ‌క్రం తిప్పుతున్న ఆయ‌న‌కు సొంత పార్టీ నేత‌లే.. ఇలా చేయ‌డంబాబుకు తెలియ‌కుండానే చ‌క్రం తిప్ప‌డం.. వంటివి రాజ‌కీయంగా వ‌చ్చే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తాయ‌ని చెబుతున్నారు. మ‌రి బాబు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.