Begin typing your search above and press return to search.

పద్మాల తోటలో ‘ఆళ్ల’.. యార్లగడ్డ’ సో స్పెషల్

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:45 AM GMT
పద్మాల తోటలో ‘ఆళ్ల’.. యార్లగడ్డ’ సో స్పెషల్
X
తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం కనిపిస్తుంది. మొత్తం 112 మందికి పద్మ పురస్కారాలు లభించగా.. ఈ జాబితాలో ఒకే ఇంటి పేరున్న నలుగురు (రెండు ఇంటిపేర్లున్న ఇద్దరికి) పద్మ పురస్కారానికి ఎంపిక కావటం ఒక విశేషంగా చెప్పాలి. మొత్తం 112 మంది పేర్లలో నలుగురు పేర్ల దగ్గరకు వచ్చేసరికి ఒకే ఇంటిపేర్లు రెండుసార్లు కనిపిస్తాయి. ఒకే ఇంటిపేరున్న వారికి అత్యున్నత పురస్కారం ఒకేసారి లభించటం కాస్త విశేషంగానే చెప్పాలి.

ఈ అరుదైన విశేషానికి కారణమైన వ్యక్తుల్ని చూస్తే.. ‘‘ఆళ్ల’’ ఇంటిపేరు మీద ఇద్దరు ప్రముఖులు ఈసారి పద్మ పురస్కారాలు లభించాయి. సైన్స్.. ఇంజనీరింగ్ విభాగంలో ఆళ్ల వెంకట రామారావుకు పద్మవిభూషణ్ పురస్కారం లభిస్తే.. వైద్య రంగానికి సంబంధించి ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక.. ‘‘యార్లగడ్డ’’ ఇంటిపేరున్న ఇద్దరు ప్రముఖులకు లభించిన పద్మ పురస్కారాలు చూస్తే.. సాహిత్యం విభాగంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు పద్మభూషణ్ పురస్కారం లభిస్తే.. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మకు పద్మశ్రీ లభించింది. ఏమైనా ఇలాంటి అరుదైన విశేషం తెలుగు వారి సొంతం కావటం మరింత ఆనందం కలిగించే అంశంగా చెప్పొచ్చు.