Begin typing your search above and press return to search.

అమెరికా వీసాల్లో ఆల్ టైమ్ రికార్డ్..అంతమంది స్టూడెంట్స్ కి జారీ !

By:  Tupaki Desk   |   25 Aug 2021 11:11 AM IST
అమెరికా వీసాల్లో ఆల్ టైమ్ రికార్డ్..అంతమంది స్టూడెంట్స్ కి జారీ !
X
అమెరికా .. ప్రపంచ దేశాల విద్యార్ధులకి కలల రాజ్యం. చదువుకునే ప్రతి ఒక్కరు కూడా , అమెరికా వెళ్లి పై చదువులు చదవాలని కోరుకుంటారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంతో మంది భారతీయులు కలలు కంటుంటారు. ఒక్కసారి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్తే, ఆ తర్వాత అక్కడే జాబ్ సంపాదించుకొని, సెటిల్ అవ్వాలనేది కల. కానీ, అమెరికా వెళ్లి చదవడం అనేది చిన్న విషయం కాదు. డబ్బు ఉంటే సరిపోదు. వీసా రావడం చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం చాలా మంది యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.

వారిలో కొందరికి అతి సులభంగా వీసా లభించినా, కొంత మంది మాత్రం ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం వల్ల వీసా సాధించలేరు. కాగా తాజాగా భారత విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యధిక మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 55 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. కొవిడ్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాకు పయనమయ్యే భారత విద్యార్థుల కోసం అధిక సంఖ్యలో వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు.

భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడం చాలా ఇష్టం. అమెరికాలో చదవడం వల్ల ప్రపంచ దేశాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలను కూడా దక్కించుకోవచ్చు. భారత విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. కరోనా సెంకడ్ వేవ్ వల్ల దాదాపు రెండు నెలల పాటు వీసా జారీ పక్రియలో జాప్యం జరిగింది.

ఈ సమయంలో వీసా ఇంటర్వ్యూ ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది మే లో ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూ ప్రక్రియ జులైలో ప్రారంభించాల్సి వచ్చిందని అతుల్‌ కేశప్‌ అన్నారు. భారతీయ విద్యార్థులకు ఓ సెమిస్టర్‌ సమయం వృథా కాకుండా ఉండేందుకే సాధ్యమైనంత త్వరగా వీసాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వీసాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్న అమెరికా విదేశాంగ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వీసాలు జారీ కానీ విద్యార్థులకు త్వరలోనే వీసాలు జారీ అవుతాయని వెల్లడించారు.