Begin typing your search above and press return to search.

ప్రధాని ఫ్రెండ్స్​ అంతా వాళ్లే.. ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   21 Feb 2021 12:21 PM IST
ప్రధాని ఫ్రెండ్స్​ అంతా వాళ్లే..  ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు..!
X
ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్​ నేత ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ దోస్తులంతా పెద్ద పెద్ద వ్యాపారులేనని.. అందుకే ఆయన వాళ్ల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. విదేశాల్లో పర్యటించే మోదీకి.. ఢిల్లీలో పక్కన ఆందోళన చేస్తున్న రైతులు కనిపించడం లేదా? అంటూ ఆమె ప్రశ్నించారు. ముజఫర్​పూర్​లో శనివారం నిర్వహించిన ‘కిసాన్​ మహాపంచాయత్’లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..

‘మన పురాతన కథలో అహంకార రాజు అనే ఓ కథ ఉంటుంది. ఈ కథలో మహారాజు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అంతఃపురానికే పరిమితమవుతాడు. ప్రజల బాగోగులు, మంచిచెడ్డలు పట్టించుకోడు. ఇప్పుడు నరేంద్రమోదీ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.

దేశాన్ని రక్షించే సైనికుడు కూడా ఓ రైతు కుమారుడే అన్న విషయాన్ని మోదీ పమరిచిపోతున్నారు. వ్యాపారవేత్తల ప్రయోజనాలకోసం ఆయన పనిచేస్తున్నాడు తప్ప.. రైతుల ప్రయోజనాల ఆయనకు పట్టడం లేదు'
అని ప్రియాంక ఆరోపణలు గుప్పించారు.

ప్రధాని దృష్టంతా తన స్వార్థం, కోటీశ్వరులైన తన మిత్రుల గురించే ఉంటుందనీ, అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.కొత్త సాగు చట్టాలతో రైతుల హక్కుల పోతాయని ప్రియాంక పేర్కొన్నారు. కొత్త చట్టాలు వస్తే మండీలు, కనీస మద్దతు ధర విధానం ఉండదని అంటున్నారు. వంటగ్యాస్, డీజిల్, కరెంటు ధరలు పెంచుతూ మోదీ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. పెట్రో ఉత్పత్తులపై విధించిన పన్నుతో ప్రభుత్వానికి రూ.3.5లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందని ఆమె ప్రశ్నించారు.