Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : కరోనా కారణంగా రైల్వే శాఖ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   22 March 2020 2:10 PM IST
బ్రేకింగ్ : కరోనా కారణంగా రైల్వే శాఖ సంచలన నిర్ణయం
X
దేశంలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినంగా ముందుకెళ్లడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన మోడీ సర్కారు.. కరోనా వైరస్ ప్రజారవాణాతో వేగంగా వ్యాప్తి చెందుతుందని గ్రహించి ఏకంగా రవాణా వ్యవస్థను స్తంభింపచేయాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు రద్దైన రైళ్లు అన్నింటిని మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే, కొంకణ్ రైల్వే సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఇక నుంచి మార్చి 31 వరకు దేశంలో రైళ్ల సర్వీసులన్నీ రద్దు కానున్నాయి. దూర ప్రాంతాలకు నడిచే ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఇంటర్ సిటీ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నగరాల్లో నడిచే సబర్బన్, మెట్రో రైళ్లను కూడా రద్దు చేసింది.

దేశంలో కరోనా కట్టడికి 31వ తేది రాత్రి 12 గంటల వరకు రైళ్ల రాకపోకలపై నిషేధం విధించినట్టు రైల్వే శాఖ పేర్కొంది. అయితే సరుకుల రవాణా చేసే గూడ్స్ రైళ్లు మాత్రం యాథావిధిగా నడిపిస్తారు. దేశంలో ఆహార కొరత రాకుండా వీటిని వినియోగిస్తారు.