Begin typing your search above and press return to search.

అందరిలో టెన్షన్ పెంచేస్తున్న 28వ తేదీ

By:  Tupaki Desk   |   27 Oct 2020 10:30 AM IST
అందరిలో  టెన్షన్ పెంచేస్తున్న  28వ తేదీ
X
అవును రాజకీయ పార్టీల్లోనే కాకుండా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారిలో కూడా 28వ తేదీ బాగా టెన్షన్ పెంచేస్తోంది. అందుకు కారణం ఏమిటంటే ఈ నెల 28వ తేదీన స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయపార్టీలతో సమావేశం పెడుతుండటమే. ఎన్నికల కమీషన్ గుర్తింపు పొందిన పార్టీలను సమావేశానికి హాజరుకావాలని కమీషన్ సమాచారం ఇచ్చింది. మార్చినెలలో అర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ సమావేశంలో ఏ పార్టీ ఎటువంటి నిర్ణయం చెబుతుందనేది ఓ కోణమైతే, పార్టీల అభిప్రాయాలు ఎలాగున్నా నిమ్మగడ్డ వైఖరి ఎలాగ ఉండబోతోంది అనేది మరో కోణం. ఇప్పటికైతే అధికార వైసీపీ ఎన్నికలను జరిపించే ఉద్దేశ్యంలో లేదు. ఎందుకంటే కరోనా వైరస్ రోజుకు సగటున 4 వేల కేసులు నమోదవుతోంది. మార్చిలో ఎన్నికలను వాయిదావేయాలని నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే సమయానికి రాష్ట్రం మొత్తం మీద నమోదైనది ఒకే ఒక్క కేసు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడలేము కాబట్టి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు.

సరే దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇపుడు ఎన్నికల నిర్వహణకు సిద్ధమైపోయారు. ఒక్క కేసున్నపుడేమో ఎన్నికలను నిర్వహించలేమని చెప్పారు. అలాంటిది రోజుకు 4 వేల కేసులు రిజిస్టర్ అవుతున్నపుడు ఎన్నికలను ఎలా నిర్వహించాలని అనుకుంటున్నారంటూ మంత్రులు కొడాలినాని, పేర్నినాని, గౌతమ్ రెడ్డి నిలదీస్తున్నారు. కాబట్టి వైసీపీ స్టాండ్ ఏమిటో అర్ధమైపోయింది. నిమ్మగడ్డ ఎన్నికలను నిర్వహించే ఆలోచనకు టీడీపీ మద్దతు ఇస్తోంది.

అంటే టీడీపీ ఏమి మాట్లాడబోతోందో అర్ధమైపోతోంది. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలున్నాయి. మరి ఈ పార్టీలు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లు లేవు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సీపీఐ కూడా ఎన్నికల నిర్వహణకు రెడీ అనేట్లుంది. బీజేపీ, కాంగ్రెస్, సిపిఎంలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం.

ఇదే విషయమై జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వేలాది కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అడుగుతున్నారు. ప్రధానమంత్రి, వైద్య నిపుణులు మరో మూడు నెలలు కరోనావైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నా కూడా ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ మొగ్గు చూపుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది.