Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా మ‌రో వేదిక‌

By:  Tupaki Desk   |   27 March 2016 10:15 AM GMT
కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా మ‌రో వేదిక‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా మ‌రో వేదిక సిద్ధం అవుతోంది. పొరుగు రాష్ట్రం మ‌హారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ద్వారా అప‌ర భ‌గీర‌థుడిగా నిలిచాన‌ని కేసీఆర్ ఆండ్ కో చెప్తుంటే...అదంటూ బూట‌క‌మ‌ని ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంపై ఉమ్మడిగా ఉద్యమించాలని ప్ర‌తిపక్ష పార్టీలన్నీ నిర్ణయించాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు తగ్గించాలన్న ప్ర‌ధాన డిమాండ్‌తో పాటు మేడిగడ్డ వద్ద కొత్త బ్యారేజీల నిర్మాణం, అందుకనుగుణంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం వెనుక ప్రభుత్వ దురుద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ఆధ్వర్యంలో తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులోనే నిర్మించాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ భేటీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షత వహించగా..పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క - కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టి.జీవన్‌ రెడ్డి - చల్లా వంశీచంద్‌ రెడ్డి - తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ - పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రేమేందర్‌ రెడ్డి - తెలంగాణ బచావో మిషన్ నేత యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి - తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్ - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే...టీఆర్ ఎస్ మిన‌హా మిగ‌తా పార్టీల‌న్నీ ఒక్క‌ట‌య్యాయి. ''వ్యాప్కోస్ నివేదికల వెనుక ఉన్న మతలబేమిటో, ప్రాజెక్టులపై వేసిన కమిటీ నివేదికలను బయటపెట్టకుండా దాచడమెందుకో స్పష్టం చేసేదాకా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలపైనే ఉంది. కాబట్టి ఈ విషయంలో అంతా కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలి'' అని నేతలంతా నిర్ణయించారు.

ప్రాణహిత డిజైన్ మార్పు స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణ‌మ‌ని, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.83 వేల కోట్లకు పెంచి అక్రమాలకు తెర తీశార‌ని పీసీసీ ఛీఫ్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. పైగా పెంచిన అంచనాలను పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలని చూస్తున్నారని, ఒక్క ఎకరా ఆయకట్టు కూడా పెరగకుండా ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పక్షాలతో చర్చించి బంగారు తెలంగాణకు బాటలు వేస్తానంటున్న సీఎం కేసీఆర్ - ఆచరణలో మాత్రం తన ఆలోచనల మేరకే వెళ్తూ అన్నింటినీ వివాదాస్పదం చేస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ ర‌మ‌ణ ఆరోపించారు. తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో చేపడితేనే రాష్ట్రానికి మేలని, ఏ మాత్రం తగ్గించినా నష్టమేన‌ని చెప్పారు. కాల్వల పేరుతో కొత్తగా కాసులు కొల్లగొట్టజూస్తున్నారని సీపీఎం కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం ఆరోపించారు. త‌మ్మిడి హెట్టి ఎత్తు తగ్గించి ప్రాణహిత గొంతు పిసికారని, ఎవరితోనూ చర్చించకుండా పూర్తి ఏకపక్షంగా చేస్తున్న ఈ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లపై ప్రజా క్షేత్రంలో పోరాడాల‌ని సీపీఐ నేత చాడ వెంక‌ట‌రెడ్డి చెప్పారు. మహారాష్ట్రతో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు తాము ముందుంటామ‌ని బీజేపీ ప్ర‌తినిధిచెప్పారు.