Begin typing your search above and press return to search.

జగన్ ఫిర్యాదుపై వెంటనే విచారణ చేయాలి

By:  Tupaki Desk   |   7 Nov 2020 7:00 PM IST
జగన్ ఫిర్యాదుపై వెంటనే  విచారణ చేయాలి
X
కొందరు న్యాయమూర్తులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరపాలంటూ ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలు) సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి విజ్ఞప్తి చేసింది. సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహఏశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీల వైఖరిపై జగన్ బాబ్డేకి లేఖ రూపంలో ఫిర్యాదు చేసిన విషయం దేశంలోనే సంచలనం సృష్టించింది. న్యాయమూర్తులపై జగన్ చేయటం, తర్వాత తన ఫిర్యాదును బహిర్గతం చేయటంపై నెగిటివ్ గాను పాజిటివ్ గాను దేశవ్యాప్తంగా స్పందనలు వినబడుతున్నాయి.

న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేయటమే తప్పన్నట్లుగా కొందరు లాయర్లు, కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇదే సందర్భంలో న్యూయమూర్తులపై ఫిర్యాదు చేయటమూ తప్పు కాదని దాన్ని బహిర్గతం చేయటం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు క్రిందకు రాదని మరోవైపు కొందరు రిటైర్ అయిన న్యాయమూర్తులు, లాయర్లు వాదిస్తున్నారు. సరే ఎవరి వాదనలు ఎలాగున్నా జగన్ లేఖపై దేశవ్యాప్తం విస్తృతస్ధాయిలో చర్చయితే జరుగుతోందన్నది వాస్తవం.

జగన్ లేఖ కారణంగానే న్యాయవ్యవస్ధలో ఉన్న లొసుగులపైన కూడా బాగా చర్చ జరుగుతోంది. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయటం జగన్ తో నే మొదలు కాలేదని గతంలో సిఎంగా పనిచేసిన దామోదరం సంజీవయ్య అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రికి ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఒకరు అప్పటి హైకోర్టు చీఫ్ జస్టిస్ వీరాస్వామి పై చేసిన అవినీతి ఆరోపణల కారణంగా ఏసీబీ కేసు నమోదు చేసిన ఘటనపైన కూడా చర్చ జరుగుతోంది.

ఇటువంటి చర్చలను దృష్టిలో ఉంచుకునే ఐలు బాబ్డేకి తాజాగా ఐలు అధ్యక్షుడు బికాశ్ రజంన్ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి సురేంద్రనాధ్ లేఖ రాశారు. జగన్ చేసిన ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపితే న్యాయవ్యవస్ధ స్వతంత్రతను కాపాడినట్లవుతుందని సూచించారు. న్యాయవ్యవస్ధపై సమాజంలో ఇటువంటి చర్చ జరగటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని కూడా ఐలు అభిప్రాయపడింది. లేఖ రూపంలో జగన్ ఫిర్యాదు చేసి నెలదాటిపోయిన కారణంగా ఇంకా జాప్యం జరగటం ఎంతమాత్రం మంచిది కాదని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. లేఖలోని ఫిర్యాదుపై విచారణ జరిపి తప్పు చేసిన వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించటం గమనార్హం.