Begin typing your search above and press return to search.

దేశంలో ఆ తేదీ నుంచి స్కూళ్లు రీఓపెన్‌.. పూర్తి వివరాలివే

By:  Tupaki Desk   |   19 Aug 2021 12:00 PM IST
దేశంలో ఆ తేదీ నుంచి స్కూళ్లు రీఓపెన్‌.. పూర్తి వివరాలివే
X
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడం. మరోవైపు కరోనా మహమ్మారి ని కట్టడి చేసే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతుండటంతో స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరిచేందుకు కసరత్తు మొదలు పెట్టారు. కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలతో పాఠశాలలు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పాఠశాలలు విధిగా కరోనా ప్రొటోకాల్స్‌ ను పాటించాలి. ప్రతి స్కూల్‌ లో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

దాదాపు ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో విద్యా రంగం ఒకటి. పిల్లలు చదువును కోల్పోగా.. ఆ రంగంపై జీవించే ఎంతో మంది ఉపాధ్యాయుల జీవనం ఆగమ్యగోచరంగా తయారైంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేసే వేలాది మంది ఉపాధ్యాయులు వీధిన పడ్డారు. అలాగే చిన్న మధ్య తరగతి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలావరకు ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. కరోనా కారణంగా 15 నెలల నుంచి బడులు బంద్ అయ్యాయి. ఆన్‌లైన్ తరగతులున్నా అందరికీ అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారు. దీనితో స్కూల్స్ రీ ఓపెన్ పై అందరూ దృష్టి పెట్టారు.

దేశంలో మొట్టమొదటగా హర్యానాలో 9 నుండి 12 వ తరగతి వరకు తొలి ఫేస్ టూ ఫేస్ క్లాసులు ప్రారంభమయ్యాయి. జూలై 16 నుంచి వీటిని ప్రారంభించారు. తరువాత నాగాలాండ్ 11, 12 తరగతులకు జూలై 26 నుంచి అనుమతించింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆగస్టు 16 నుంచి ఏపీలో కూడా స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇక, ఇదే క్రమంలో తెలంగాణ లో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది.

క‌ర్ణాట‌క‌లో కాలేజీల‌ను ఈ నెల ఆరంభంలోనే ప్రారంభించారు. ఆగస్టు 23 నుంచి కర్టాటకలో స్కూల్స్ కూడా తెరుచుకోనున్నాయి. తమిళ‌నాడులో సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి స్కూళ్ల‌ను రీ ఓపెన్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. తొమ్మిది నుంచి ఆ పై త‌ర‌గతుల పిల్ల‌ల‌కు విద్యాల‌యాల‌ను ఓపెన్ చేయ‌నున్న‌ట్టుగా అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక ఈ నెల 23 నుంచి హైస్కూళ్ల‌ను, సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి ప్రైమ‌రీ స్కూళ్ల‌ను తెర‌వ‌డానికి యూపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇలా మొత్తంగా ఒక్కొక్క రాష్ట్రం కూడా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ ఓపెన్ చేయడానికే మొగ్గుచూపుతున్నాయి.

ఇప్పటికే చాలా దేశాల్లో గత నెలలోనే పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రెండు నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు కరోనా వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అందుకే వారిని బడికి పంపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పాఠశాలలు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం పాఠశాలలు మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదహారు కోట్ల మంది పిల్లల విద్య ప్రభావితమైందని తెలిపింది. అంతే కాదు భవిష్యత్తులో పిల్లల పోషకాహారం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులపై కూడా కరోనా ప్రతికూల ప్రభావం కనిపించనుంది.