Begin typing your search above and press return to search.

అఖిలప్రియ అడుగులు జనసేన వైపా?

By:  Tupaki Desk   |   8 Oct 2021 8:30 AM GMT
అఖిలప్రియ అడుగులు జనసేన వైపా?
X
వైసీపీలో రాజకీయం మొదలుపెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆశ చూపిస్తే ఆ పార్టీలో చేరింది. ఏకంగా చిన్న వయసులోనే గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యింది.. ఆ తర్వాత కొన్ని దందాలతో అభాసుపాలైంది. ఆమెపై తెలంగాణలో భూకబ్జా ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే టీడీపీలో కూడా ఆమెకు నిరాదరణ ఎదురైంది.

ప్రస్తుతం భూమా అఖిల ప్రియ జనసేనలోకి వెళ్లనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుండడం.. దాన్ని అఖిల ప్రియ ఖండించకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.

అఖిలప్రియపై భూకబ్జా ఆరోపణలు రావడంతో పాటు కర్నూలులో ఆమెను టీడీపీ నేతలు వ్యతిరేకించి వెలివేశారు. గత ఏడాదిన్నరగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కనీసం అఖిలప్రియకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట.. దీంతో మనస్థాపానికి గురైన అఖిలప్రియ అడుగులు జనసేన వైపు పడుతున్నట్టు సమాచారం. వైసీపీలో ఉండగా జగన్ ను దెబ్బతీసేందుకు తన కుటుంబాన్ని చంద్రబాబు వాడుకున్నారనే ఆవేదన అఖిలప్రియలో కనిపిస్తోందని సమాచారం.అవసరం తీరాక తనను పట్టించుకోలేదనే కోపం ఆమెలో కనిపిస్తోంది.

మరోవైపు అఖిలప్రియ కిడ్నాప్ లు, భూదందాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తోందనే ఆగ్రహం చంద్రబాబులో ఉన్నట్టు కర్నూలు టీడీపీ నేతలు చెబుతున్నారు. భర్త, తమ్ముడితో కలిసి ఆమె పార్టీ పరువును బజారున పడేస్తున్నారనే ఫిర్యాదులు టీడీపీ అధిష్టానానికి వెల్లువెత్తినట్టు సమాచారం. అందుకే తెలంగాణలో ఆమెను జైల్లో వేసినా.. చంద్రబాబు, లోకేష్ ఏమాత్రం పట్టించుకోలేదని కర్నూలు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీ, చంద్రబాబు పట్టించుకోకపోవడంతో పాటు 2024లో పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకం కూడా రోజురోజుకు అఖిలప్రియలో సడలుతోందని సమాచారం. దీంతో టీడీపీలో కొనసాగడం వేస్ట్ అని నిర్ధారించారు. దీంతో ముందుగానే ప్రత్యామ్మాయ రాజకీయ వేదిక చూసుకునేందుకు అఖిలప్రియ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు జనసేన పార్టీనే సరైందనే అభిప్రాయానికి అఖిలప్రియ వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.