Begin typing your search above and press return to search.

6 కోట్లకు పరువునష్టం దావా వేసిన రజనీ కుమార్తె

By:  Tupaki Desk   |   22 Aug 2017 6:02 AM GMT
6 కోట్లకు పరువునష్టం దావా వేసిన రజనీ కుమార్తె
X
సినిమాల‌కు సంబంధించిన వార్త‌ల‌తో త‌మిళ సూప‌ర్ స్టార్ త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కేవారు. కొన్ని ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలతో ర‌జ‌నీ ఫ్యామిలీ మీడియాలో క‌నిపించేది. కానీ.. కొద్ది రోజులుగా అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ర‌జ‌నీ కుమార్తె విడాకులు కేసు కావొచ్చు.. ర‌జ‌నీ స‌తీమ‌ణికి సంబంధించి ఆర్థిక వ్య‌వ‌హారాలు.. చెక్ బౌన్స్‌.. అద్దె చెల్లించ‌క‌పోవ‌టం ఇలాంటి ఇష్యూల‌తో త‌ర‌చూ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్న ర‌జ‌నీ ఫ్యామిలీ తాజాగా ఇదే త‌ర‌హాలో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు.

ఈ మ‌ధ్య‌న ర‌జ‌నీ స‌తీమ‌ణి నిర్వ‌హిస్తున్న ఒక ఆశ్ర‌మ పాఠ‌శాల భ‌వ‌నానికి అద్దె క‌ట్ట‌లేదంటూ స‌ద‌రు భ‌వ‌న య‌జ‌మాని భ‌వ‌నానికి తాళం వేసిన వైనం మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌టం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో త‌మ ప‌రువు పోయిందంటూ ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య ధ‌నుష్ సోమ‌వారం చెన్నై హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. చెన్నై శివారు గిండీ స‌మీపంలోని రేస్ కోర్స్ రోడ్డులో ర‌జ‌నీ ఫ్యామిలీ ఒక స్కూల్ ను నిర్వ‌హిస్తున్నారు.

అయితే.. ఈ పాఠ‌శాల స్థ‌ల య‌జ‌మాని వెంక‌టేశ్వ‌ర్లు.. త‌న‌కు ఇవ్వాల్సిన అద్దెను ఇవ్వ‌టం లేద‌ని చెబుతూ.. ఈ నెల 15న పాఠ‌శాల‌కు తాళం వేసుకొని వెళ్లిపోయారు.

వ‌రుస సెలువుల అనంత‌రం.. స్కూల్ కు వ‌చ్చిన విద్యార్థులు.. పాఠ‌శాల సిబ్బందికి భ‌వ‌నానికి తాళం క‌నిపించ‌టం.. అద్దె బ‌కాయిలు చెల్లించ‌ని కార‌ణంగా స్థ‌ల య‌జ‌మాని తాళం వేసిన‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో.. ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం ల‌భించింది. ఈ ఉదంతంపై తాజాగా ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య ధ‌నుష్ హైకోర్టును ఆశ్ర‌యించారు.

తాజాగా ఆమె దాఖ‌లు చేసిన పిటీష‌న్ ప్ర‌కారం శ్రీ రాఘ‌వేంద్ర విద్యా సంఘాన్ని 1991లో రిజిస్ట‌ర్ చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.ఈ సంఘం పేరిట వేల‌చ్చేరి.. గిండీ.. సైదాపేట‌ల‌లో పాఠ‌శాల‌ల్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గిండీ రేస్ కోర్స్ రోడ్డులోని స్కూల్ ను 2005లో లీజ్ తీసుకున్నామ‌ని.. గ‌త మే వ‌ర‌కు అద్దె చెల్లించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ నెల 15న స్థ‌ల య‌జ‌మాని వెంక‌టేశ్వ‌ర్లు ఆశ్ర‌మంలోకి చొర‌బ‌డి.. అద్దె ఇవ్వ‌టం లేదంటూ తాళం వేశార‌న్నారు. స్కూల్ ను మూయించార‌న్నారు. అద్దె చెల్లించ‌లేదంటూ ఆశ్ర‌మ పాఠ‌శాల‌ను త‌మ అధీనంలోకి తీసుకున్న‌ట్లుగా మీడియాలో ప్ర‌చారం చేసిన‌ట్లుగా ఆరోపించారు. హ‌ద్దు మీరి స్కూల్లోకి ప్ర‌వేశించినందుకు రూ.కోటి.. త‌మ పాఠ‌శాల సంఘం పేరును చెడ‌గొట్టినందుకు రూ.5కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేలా ఆదేశించాల‌ని కోరారు.

ఇత‌రులు త‌మ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోకి రాకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు. ఐశ్వ‌ర్య ధ‌నుష్ పిటీష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ అంశంపై ఈ రోజు (మంగ‌ళ‌వారం) విచార‌ణ జ‌ర‌గ‌నుంది.