Begin typing your search above and press return to search.

రూ.10వేల కోట్ల బకాయి చెల్లించిన ఎయిర్‌ టెల్!

By:  Tupaki Desk   |   17 Feb 2020 3:58 PM GMT
రూ.10వేల కోట్ల బకాయి చెల్లించిన ఎయిర్‌ టెల్!
X
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో భార‌తి ఎయిర్‌టెల్ కంపెనీ.. ఈ రోజు 10వేల కోట్ల ఏజీఆర్ బ‌కాయిల‌ను టెలికాంశాఖ‌కు చెల్లించింది. టెలికాం డిపార్ట్‌ మెంట్‌ కు ఎయిర్‌టెల్ మొత్తం 35, 500 కోట్లు బ‌కాయి ఉన్న‌ది. స్పెక్ట్ర‌మ్ చార్జీలు, లైసెన్సు ఫీజుల కింద ఆ సంస్థ బకాయి ఉన్న‌ది. భార‌తి ఎయిర్‌ టెల్ లిమిటెడ్ త‌ర‌పున 9500 కోట్లు, భార‌తి హెక్సాకామ్ త‌ర‌పున 500 కోట్లు చెల్లించిన‌ట్లు భార‌తి ఎయిర్‌ టెల్ ఈ రోజు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

తాము స్వయం మదింపు కసరత్తు చేపట్టామని, అది ముగిసిన వెంటనే సుప్రీంకోర్టు లో తదుపరి విచారణ గడువులోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని ఆ సంస్థ స్పష్టం చేసింది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ , ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్‌ టెల్‌ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని తెలిపింది.

ఇకపోతే టెలికాం సంస్థ‌లు బకాయీలు చెల్లించ‌డం లేదంటూ.. ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇదే సమయంలో టెలికాం సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ టెలికాం విభాగంలోని ఓ డెస్క్‌ అధికారి ఆదేశాలు ఇవ్వడంపైనా అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. గతవారం కోర్టు ఆగ్రహించడం తో టెలికాం కంపెనీలు దిద్దుబాటు చర్యలను చేపట్టాయి.