Begin typing your search above and press return to search.

పాత నోట్ల మార్పిడిలో హైటెక్ ప్రయత్నం!

By:  Tupaki Desk   |   11 Nov 2016 3:36 AM GMT
పాత నోట్ల మార్పిడిలో హైటెక్ ప్రయత్నం!
X
దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న అవినీతిని - నల్లదనాన్ని రూపుమాపే క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... అప్పటి వరకూ మనుగడలో ఉన్న రూ.500 - రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని 72 గంటలపాటూ కొన్ని సడలింపులను ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వాసుపత్రులు - మెడికల్ షాపులు - రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు - ప్రభుత్వ బస్సులు - విమానాశ్రయాల్లోని ఎయిర్ లైన్స్ కౌంటర్లలో - ప్రభుత్వ రంగ సంస్థల అధీనంలో నడిచే పెట్రోల్ - డీజిల్ - గ్యాస్ స్టేషన్లు - పాల కేంద్రాలు - శ్మశానాల్లోనూ పాత 500 - 1,000 నోట్లను స్వీకరించే వెసులుబాటు కల్పించారు. ఆ సంగతులు అలా ఉంచితే... ఏ నల్ల కుబేరుల బరతం పట్టాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో... ఆ నల్లకుబేరులే పాత రూ.500 - రూ.1000 నోట్లను మార్పిడి చేయడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు!

ఈ విషయంలో తమ బుర్రకు పద్నుపెడుతున్న కొందరు నల్లకుబేరులు చాకచక్యంగా తమ దగ్గరున్న నల్లధనాన్ని మార్పిడికి వాడాలనుకున్నారు. ఈ క్రమంలో ముందుగా పెద్ద మొత్తంలో ధరలుండే విమాన టికెట్లను బుక్ చేసుకోవడం, తర్వాత క్యాన్సల్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల నల్లధనం సునాయాసంగా తెల్లగా మార్చవచ్చని వారు భావించారు. అయితే ఎంతో పకడ్బందీగా నల్లకుబేరుల విషయంలో చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఈ ఘరానా మోసాన్ని ఆదిలోనే పసిగట్టింది. దీంతో పాత నోట్లతో టికెట్లను బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సల్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో కౌంటర్ దగ్గర ఎవరైతే పాత 500 - 1000 రూపాయల నోట్లతో టికెట్లను బుక్ చేసుకొని క్యాన్సల్ కోసం తిరిగి రిక్వెస్ట్ పెట్టుకుంటారో వారి టికెట్లను రద్దు చేయడం లేదా తమ టికెట్ రుసుమును తిరిగి రిఫండ్ చేయడం సాధ్యంకాదని అన్ని ఎయిర్స్ లైన్స్ కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది!

ఈ విషయంలో ఎంతమంది నల్లబాబులు ఇలా ఆలోచిస్తారులే అనుకుంటే పోరపాటే... ఎందుకంటే తాజాగా పెరిగిన కౌంటర్ బుకింగ్ లే ఈ విషయాన్ని చెబుతున్నాయి. సాధారణంగా రోజుకు 20 నుంచి 25 లక్షల రూపాయలు కౌంటర్ బుకింగ్ ద్వారా వచ్చేవి కానీ, 500 - 1000రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కౌంటర్లలో రోజుకు కోటిరూపాయల వరకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారని ఎయిర్‍ లైన్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు! అంటే సాధారణం కంటే ఇది దాదాపు నాలుగు రెట్లు అని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి అజయ్ జస్రా తెలిపారు. సాదారణంగా ఎయిర్ లైన్స్ టిక్కెట్లను అధికశాతం మంది ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటారు. కానీ... తాజా నిర్ణయంతో ఇలా క్యూలు కట్టి మరీ అధికారికంగా నల్లధనాన్ని మార్చాలనుకున్నారన్నమాట!!

ఈ విషయంలో అధికారికంగా ప్రభుత్వంగానీ, డీజీసీఏ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు రోజుల నుంచి ఎవరైతే కౌంటర్ల దగ్గర పాత 500 - 1000 రూపాయలతో టికెట్లను కొనుగోలు చేసి క్యాన్సల్ చేసుకుంటారో వారి టికెట్ రుసుము తిరిగి ఇవ్వబోమని ఇప్పటికే కొన్ని ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. ఇదే క్రమంలో విమానయాన సంస్థ విస్టారా కూడా గత రెండు రోజుల నుంచి పాత పెద్ద నోట్లతో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సల్ చేసుకుంటే వాటికి రుసుము రిఫండ్ చేయడం సాధ్యంకాదని ట్విట్టర్ లో పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/