Begin typing your search above and press return to search.

అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో 50కి పైగా పోట్లు పొడిచారు

By:  Tupaki Desk   |   2 April 2021 6:46 AM GMT
అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో 50కి పైగా పోట్లు పొడిచారు
X
హైదరాబాద్ లో షాకింగ్ హత్య ఒకటి చోటు చేసుకుంది. తమ తండ్రిని దారుణంగా హత్య చేసిన మజ్లిస్ నేతపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు నడి రోడ్డుమీద దారుణానికి తెర తీశారు. గతానికి భిన్నంగా గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ప్రతీకారం పేరుతో ఆరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఉదంతంలో తాము టార్గెట్ చేసిన వ్యక్తిని.. పట్టపగలు.. నడి రోడ్డు మీద వేటకొడవళ్లతో 50 వేట్లతో నరికి.. నరికి చంపిన వైనం ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా మారింది.

రాజేంద్రనగర్ సమీపంలోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య వివరాల్లోకి వెళితే.. మజ్లిస్ నాయకుడు 45 ఏళ్ల అసద్ ఖాన్.. అంజాద్ ఖాన్ మంచి మిత్రులు. వారి స్నేహాన్ని మరింత బలపర్చుకోవాలని అసద్ తన కుమార్తెను.. స్నేహితుడి కుమారుడికి ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొంతకాలానికి అల్లుడికి.. కూతురికి మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది.

దంపతుల మధ్య గొడవలకు తన మిత్రుడే కారణమని భావించిన అసద్ అతడిపై పగ పెంచుకున్నాడు. 2018లో శాస్త్రిపురంలో ఒంటరిగా ఉన్న తన స్నేహితుడిపై ఐదుగురితో కలిసి దాడి చేశాడు. సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఆ ఘటనలో జైలుు వెళ్లి కొద్దికాలం క్రితం బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతనిపై రౌడీ షీట్ ఉంది. తమ తండ్రిని చంపిన హతుని కోసం కుమారులు ఎదురుచూస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం అసద్ తన మిత్రుడితో కలిసి మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో టూవీలర్ మీద మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నైస్ హోటల్ వైపు వెళుతున్నాడు. రాంగ్ రూట్ లో వేగంగా వాహనం మీద వచ్చిన ఆటో వారి బైక్ ను ఢీ కొట్టింది. కింద పడిన అసద్ పై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ సందర్బంగా విచక్షణరహితంగా పొడిచి.. తామువాడిన ఆయుధాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. మరణించినఅసద్ ఒంటిపైన యాభైకి పైగా కత్తిపోట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజా ఉదంతం పెను సంచలనంగా మారింది.