Begin typing your search above and press return to search.

బీజేపీ తదుపరి ఫోకస్ ఆ రెండు రాష్ట్రాలేనా ?

By:  Tupaki Desk   |   22 March 2020 3:30 AM GMT
బీజేపీ తదుపరి ఫోకస్ ఆ రెండు రాష్ట్రాలేనా ?
X
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టిన బీజేపీ , తదుపరి టార్గెట్   రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అని తెలుస్తుంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ , లోక్ సభ ఎన్నికల్లో  బీజేపీ బలం ఏమిటో చూపించింది.  ఈ మూడు రాష్ట్రాల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 65 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 62 సీట్లల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఫార్ములానే ఉపయోగించి,, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ఆలోచిస్తుంది.

2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్ లో 25 సీట్లకు గాను 24 స్థానాలను, ఛత్తీస్ గడ్ లో 11 సీట్లకు గాను తొమ్మిదింటిని, మధ్యప్రదేశ్ లో 29 నియోజకవర్గాలకు గాను 28 స్థానాలను చేజిక్కించుకుంది. మధ్యప్రదేశ్ లో ఇటీవల కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఆయనకు మద్దతుదారులైన 22 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడడం, సభలో బల పరీక్ష జరపాలంటూ బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం,, చివరకు కమల్ నాథ్ రాజీనామా చేయడం తెలిసిందే.

దీంతో ఇక బీజేపీ ఈ రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టడానికి ఉవ్విళ్ళూరుతోంది. ఇక బీజేపీ పొలిటికల్ ఎజెండాలో రాజస్థాన్ కూడా చేరింది. ఇక్కడకూడా మధ్యప్రదేశ్ మాదిరే సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం స్వల్ప  మెజారిటీతో సాగుతోంది. పైగా ఆయనకు, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు పడటం లేదు. వజ్రాల వర్తకుడు రాజీవ్ అరోరాను రాజ్యసభకు పంపాలన్న అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనను సచిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిజినెస్ మన్ బదులు.. పార్టీ నేతల్లో ఎవరినైనా ఎగువసభకు పంపాలని సచిన్ కోరుతున్నారు. రెబెల్ బీఎస్పీ ఎమ్మెల్యేల సపోర్టుతో ఈ రాష్ట్రంలో గెహ్లాట్ ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే వీరు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉన్నాయి. సిపీఎం నుంచి ముగ్గురు, ఆర్ ఎల్ డీ నుంచి ఒక్కరితో బాటు 112 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నుంచి 80 మంది ఉండగా.. వీరికి సుమారు ఇరవై మంది ఎమ్మెల్యేలు మద్దతునిస్తున్నారు. దీంతో గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం బీజేపీకి కష్టసాధ్యమేమీ కాదు. తగిన సమయం కోసం ఈ పార్టీ ఎదురు చూస్తోంది. ఇక ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో సీఎం భూపేష్ బాఘెల్ ప్రభుత్వం పైనాబీజేపీ నేతలు కన్నేశారు. ఇక్కడి 11 లోక్ సభ స్థానాలకు గాను తొమ్మిదింటిని  కైవసం చేసుకున్న బీజేపీ.. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది. ఇది తనకు అనుకూల పరిణామం కాగలదని ఆశిస్తోంది.