Begin typing your search above and press return to search.

ఈసారి ఆది నోట 'తీట' మాట‌లు

By:  Tupaki Desk   |   27 Aug 2017 5:17 AM GMT
ఈసారి ఆది నోట తీట మాట‌లు
X
అధికారంలో చేతిలో ఉన్న‌ప్పుడు కొంద‌రు నేత‌ల‌ నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఇష్టానుసారం వ‌చ్చేస్తుంటాయి. అలాంటి వారిలో ఏపీ మార్కెటింగ్ మంత్రివ‌ర్యులు ఆదినారాయ‌ణ‌రెడ్డి ముందుంటారు. త‌న‌కు తోచిన‌ట్లుగా మాట్లాడే త‌త్త్వం ఉన్న ఆయ‌న నోటికి ఎదురే ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇచ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద అభిమానం చాటుకోవ‌టానికి ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై త‌ర‌చూ నోరు పారేసుకునే మంత్రి ఆది.. మొన్నా మ‌ధ్య‌న ద‌ళితుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.

ద‌ళితులు శుభ్రంగా ఉండ‌ర‌ని.. స‌క్ర‌మంగా చ‌దువుకోరంటూ నోరు పారేసుకున్న మంత్రి ఆది.. వారు అభివృద్ధి చెంద‌క‌పోవ‌టానికి కార‌ణం వారేనని వ్యాఖ్యానించారు. అంతేనా.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ ప‌దేళ్లు మాత్ర‌మే రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే.. 70 ఏళ్లుగా కొన‌సాగుతున్నాయంటూ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు పైనా నోరు పారేసుకున్నారు. అయితే.. అలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇలా త‌న నోటిమాట‌ల‌తో త‌ర‌చూ వివాదాల్ని సృష్టిస్తున్న ఆయ‌న తాజాగా మ‌హిళ‌ల‌పై త‌న‌కున్న చుల‌క‌న‌భావాన్ని ప్ర‌ద‌ర్శించారు. క‌డ‌ప‌జిల్లా ప్రొద్దుటూరు మున్సిప‌ల్ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో హౌసింగ్ ఫ‌ర్ ఆల్ స్కీం కు చెందిన గృహ నిర్మాణాల‌కు భూమిపూజ చేశారు. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన మ‌హిళ‌ల‌పై నోరుపారేసుకున్నారు.

భూమిపూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌హిళ‌లు కొంద‌రు.. అప్ప‌టికే భోజ‌న స‌మ‌యం కావ‌టంతో మంత్రి మాట్లాడుతున్న వేళ బ‌య‌ట‌కు వెళ్ల‌బోయారు. దీంతో ఆగ్ర‌హించిన మంత్రివ‌ర్యులు.. మాకేమైనా తీట ప‌ట్టి వ‌చ్చామా? కూర్చునే ఓపిక కూడా లేదా? అన్ని ప‌థ‌కాలు కావాలంటారే అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. త‌మ‌కూ లంచ్ టైమేనంటూ మాకూ ఆక‌లి అవుతోంది.. అంద‌రూ వ‌చ్చి కూర్చోడంటూ వ్యాఖ్యానించారు.

దీంతో ఆక‌లితో ఉన్న మ‌హిళ‌లు మంత్రి మాట‌తో తిరిగి వ‌చ్చి కూర్చుండిపోయారు. నిజానికి స‌మావేశానికి త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. మెప్మా సీఓలు.. ఆర్పీలు బ‌లవంతంగా పిలుచుకురావ‌టంతో తాము వ‌చ్చామ‌ని.. అలాంటి త‌మ‌ను నోటి దురుసుతునంతో మంత్రి మాట‌లు అనేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆక‌లితో ఉన్న మ‌హిళ‌ల ప‌ట్ల మంత్రివ‌ర్యుల తీట మాటపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. క‌నీస గౌర‌వం లేకుండా ఆ మాట‌లేంద‌ని ఫైర్ అవుతున్నారు.