Begin typing your search above and press return to search.

తొలిరోజే 80 శాతం మంది స్కూళ్లకి వెళ్లారట !

By:  Tupaki Desk   |   2 Nov 2020 4:00 PM GMT
తొలిరోజే 80 శాతం మంది స్కూళ్లకి వెళ్లారట !
X
ఆంధ్రప్ర‌దేశ్‌ లో గత ఏడు నెలల నుండి మూతబడి ఉన్న పాఠశాలలు.. ఈ రోజునుంచి పున:ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనల ప్రకారం తరగతులను నిర్వహిస్తున్నారు. మార్చిలో విధించిన లాక్‌ డౌన్ నాటినుంచి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ద‌శ‌ల‌వారీగా స్కూళ్ల‌ను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చిన విషయం తెలిసిందే. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల‌కు ఒక రోజు తర్వాత ఒకరోజు అది కూడా ఒక్క పూట తరగతులను నిర్వహించనున్నారు. న‌వంబ‌ర్ 23వ తేదీ నుంచి 6,7,8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు తరగతులు జ‌ర‌గ‌నున్నాయి.

ఇకపోతే , ఈ విషయం పై తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారని చెప్పారు. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా పాఠశాలలు నాడు-నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు జగనన్న విద్య కానుక ఇచ్చామని, అన్ని వసతులు వారికి అందుబాటులోకి వచ్చాయని, తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కరోనా పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ‍ ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించాం. ఇది న్యాయమైన నిర్ణయం. దాదాపు అయిదారు నెలలు స్కూల్స్ నడవలేదు. అలాంటప్పుడు పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారు?. వాళ్ళకి టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచించి 70 శాతం ఫీజు నిర్ణయించాం. ఏ ఒక్కరూ అంతకు మించి వసూలు చేయవద్దు. అలా చేస్తున్నట్లు పిర్యాదు వస్తే చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీచేశారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు తప్పనిసరిగా ఉండాలి. ఆయా సంస్థల్లో వసతులపై ఆకస్మిక తనికీలు చేస్తున్నాం అని అన్నారు.