Begin typing your search above and press return to search.

దుబ్బాకలో ఓడారని కార్యకర్త సూసైడ్.. పాడె మోసిన హరీశ్

By:  Tupaki Desk   |   12 Nov 2020 9:00 AM IST
దుబ్బాకలో ఓడారని కార్యకర్త సూసైడ్.. పాడె మోసిన హరీశ్
X
అభిమానం తప్పు కాదు. కానీ.. అభిమానం పేరుతో కన్నవాళ్లను.. అయినోళ్లందరిని అన్యాయం చేసే తీరును తప్పనిసరిగా ఖండించాల్సిందే. తాను అభిమానించి.. ఆరాధించి.. పిచ్చిగా ప్రేమించే పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిందని వేదన చెందుతూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవటం వేదనకు గురి చేసినా.. ఇలాంటి తీరును తీవ్రంగా ఖండించాల్సిందే. ఎన్నికలు అన్నాక.. గెలుపోటములు సహజం. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలే తప్పించి.. ఓడినంత మాత్రానా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఇందుకు భిన్నంగా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం కొనయిపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వైనం సంచలనంగా మారింది. పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త గురించి సమాచారం అందుకున్న మంత్రి హరీశ్.. వారింటికి వెళ్లారు. నివాళులు అర్పించటమే కాదు.. స్వయంగా కార్యకర్త పాడె మోశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావన్నారు. కార్యకర్తలందరిని సంయమనంతో వ్యవహరించాలని కోరిన ఆయన.. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిద్దామన్నారు. కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న విషయం గురించి తెలిసినంతనే బాధ పడినట్లుగా పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ఎన్నిక ప్రచారంలో చురుగ్గా వ్యవహరించేవాడన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ సాయం కింద రూ.2లక్షల మొత్తాన్ని అందించామని.. అతడి పిల్లలకు చదివిస్తామన్నారు. వారి కుటుంబానని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాట ఇచ్చారు.