Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో యాక్టివ్‌ .. ఓటింగ్ ‌లో ఇన్ యాక్టివ్ .. టెక్కీలు నిద్రమత్తు వీడాలి !

By:  Tupaki Desk   |   1 Dec 2020 9:07 AM GMT
సోషల్ మీడియాలో యాక్టివ్‌ ..  ఓటింగ్ ‌లో ఇన్ యాక్టివ్  .. టెక్కీలు నిద్రమత్తు వీడాలి !
X
గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ చాలా మందకొడిగా ముందుకి సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.2 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్ ‌లో 49.19 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా తలాబ్‌ చంచలంలో 0.74, అమీర్ ‌పేట్‌ లో 0.79 పోలింగ్‌ శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఓటు వేసేందుకు కేవలం మరో 4 గంటల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు సెలబ్రిటీలు ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నా సాధారణ పబ్లిక్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక లాక్‌ డౌన్ నుంచి దాదాపు టెకీలంతా నగరాన్ని విడిచి వెళ్లటంతో కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని అధికారులు భావిస్తున్నారు.

అయితే , లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో మళ్లీ కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఓపెన్ అయ్యాయి. టెక్కీలు కూడా మళ్లీ హైదరాబాద్ కి వచ్చారు. కానీ, ఈ పోలింగ్ లో పాల్గొనడం లేదు. పండు ముసలివారు సైతం ఉదయాన్నే పోలింగ్ బూతుల వద్దకి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అలాగే ఇప్పటికే పలువురు ప్రముఖులు , సినీ స్టార్స్ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కానీ, టెక్కీలు మాత్రం పెద్దగా తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా హాలిడే ఇవ్వడంతో ఎంచక్కా తిని ఇంట్లో టీవీ చూస్తున్నట్టు ఉన్నారు. దీనిపై ఇప్పుడు విమర్శలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. కనీసం 10, 11 గంటల వరకు కూడా అంతగా ముందకు రాలేదు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. ఓటు వేస్తేనే సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. అయినప్పటికీ టెక్కిల్లో పెద్దగా మార్పు రావడం లేదు.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌ గా ఉండే టెకీలు ఓటింగ్ ‌లో ఇన్ యాక్టివ్ ‌గా ఉంటున్నారు. బద్దకమే.. నిర్లక్ష్యమే తెలీదు కానీ ఓటంటేనే ముఖం చాటేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోడ్డు బాలేదు, డ్రైనేజీ బాలేదు, తాగునీరు రావడం లేదు.. వీధిలైట్లు రావడం లేదు అంటూ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. కానీ ఓటు వేయనికి సమస్యలను ప్రస్తావించే అవకాశం ఎక్కడిదని విశ్లేషకులు చెబుతున్నారు. కొండాపూర్, మియాపూర్, మాదాపూర్.. ఐటీ హబ్. ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. దీనితో ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ఇంకా సమయం ఉంది ఒక అరంగంట ఓటు వేయడానికి కేటాయించి ఓటింగ్ లో పాల్గొనాలని కోరుతున్నారు.