Begin typing your search above and press return to search.

దూకుడు స‌రే.. స‌వాళ్ల‌ను ఛేదించే అస్త‌మేది అచ్చెన్నా?

By:  Tupaki Desk   |   23 Oct 2020 2:20 PM IST
దూకుడు స‌రే.. స‌వాళ్ల‌ను ఛేదించే అస్త‌మేది అచ్చెన్నా?
X
నువ్వు రెండంటే.. నే నాలుగంటా! అన‌డం .. రాజ‌కీయాల్లో స‌హ‌జ ధోర‌ణే! అయితే.. ఇది ఎంత వ‌ర‌కు నేత‌ల‌కు, పార్టీకి కూడా మేలు చేస్తుంద‌నేదే కీల‌క విష‌యం. ఎందుకంటే.. ఎప్పుడూ మాట‌ల దూకుడే పార్టీల‌కైనా.. నేత‌ల‌కైనా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌లేం. వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాలు.. పార్టీలో సంతృప్తులు.. అసంతృప్తులు.. కోవ‌ర్టులు.. ఇలా అనేక విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అడుగులు వేస్తే.. త‌ప్ప ఒక పార్టీ మ‌న‌గ‌ల‌గ‌డం, ఎన్నిక‌ల్లో నెగ్గుకు రాగ‌ల‌గ‌డం అనేది సాధ్యం కాదు.. ఇదంతా ఎందుకు చ‌ర్చ‌కు వ‌స్తోందంటే.. కొత్త‌గా టీడీపీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన‌.. అచ్చెన్నాయుడు దూకుడు చూపిస్తున్నారు.

కానీ, పార్టీ ప‌రంగా ఆయ‌న చాలానే స‌వాళ్ల‌ను ఎదుర్కొనాల్సి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ఇలాంటి దూకుడు వ‌ల్ల సొంత ఇమేజ్ సంపాయించుకున్నా.. పార్టీ ప‌రంగా చూస్తే.. ఈ దూకుడు ప‌నిచేసి న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌నేది టీడీపీ హిస్ట‌రీ చెబుతున్న వాస్త‌వ‌మ‌ని అంటున్నారు. విష‌యం ఏంటంటే.. భిన్న‌మైన సామాజిక వ‌ర్గాల స‌మాహారమే ఏ పార్టీ అయినా.. అందునా.. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్య ఎక్కువ‌గా ఉన్న టీడీపీ వంటి పార్టీని న‌డిపించ‌డం అంత తేలిక‌కాదు. అంద‌రూ సీనియ‌ర్లే.. ఎవ‌రికి వారికి వ్యూహాలు ఉన్నాయి. అచ్చెన్న‌క‌న్నా.. ముందునుంచి ఉన్న నేత‌లు అనేక మంది ఉన్నారు.

మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గమే పార్టీ క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌. ఔన‌న్నా.. కాద‌న్నా.. వీరి మ‌ద్ద‌తు పార్టీకి చాలా ముఖ్యం. కానీ, ఇప్పుడు గుంటూరు, కృష్ణా, విశాఖ‌ జిల్లాల్లోని క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదేస‌మయంలో బీసీల్లోనే కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌లేద‌నే అసంతృప్తి ఉంది. మ‌రీ ముఖ్యంగా కాపుల్లో ఇప్పుడున్న వారికే ప్రాధాన్యం ఉంద‌ని.. కొత్త‌వారికి ఎక్క‌డా చోటు క‌ల్పించ‌లేద‌ని అంటున్నారు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రిలో క్ష‌త్రియ వ‌ర్గానికి కూడా అవ‌కాశాలు త‌క్కువ‌గానే వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. వీరంతా కూడా పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు.

వీరిని స‌రిచేయ‌డం అనేది .. అచ్చెన్న‌ముందున్న ప్ర‌ధాన స‌వాలు. వీరిని దారిలో పెట్ట‌డం, పార్టీకి తిరిగి వీరిని మ‌ద్ద‌తుగా తీర్చిదిద్ద‌డం అనేది కేవ‌లం ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌డంవ‌ల్ల సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేదు. అదే ఉంటే.. చంద్ర‌బాబు ఒక్క‌రు చాలు.. మిగిలిన టీంతో ప‌నేలేదు. ఇక‌, అదేస‌మ‌యంలో యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం కూడా అచ్చెన్న‌కు మ‌రింత పెను స‌వాలు. యువ‌తకు చంద్ర‌బాబు ఇచ్చిన కీల‌క హామీల్లో అనేక అమ‌లు కాలేద‌నే అసంతృప్తి ఉంది. అదేస‌మ‌యంలో పార్టీలో 33 శాతం ప‌ద‌వులు వారికే అన్నారు. కానీ, ఇప్పుడున్న వారికే ఇచ్చారు త‌ప్ప‌.. ఆది నుంచి పార్టీ ని న‌మ్ముకున్న‌వారికి అన్యాయం చేశార‌నే వాద‌న బ‌లంగా ఉంది.

మ‌హిళా నేత‌ల‌లోనూ పంచుమ‌ర్తి అనురాథ‌, గౌతు శిరీష‌, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌, పాణ్యం మాజీ ఎమ్మెల్యే చ‌రితా రెడ్డి.. ఇలా అనేక మంది త‌మ‌కు అన్యాయం చేశార‌ని ర‌గిలి పోతున్నారు. వీరంద‌రినీ కూడా క‌లుపుకొని పోవ‌డం, పారిశ్రామిక వ‌ర్గాల‌కు తిరిగి పార్టీని చేరువ చేయ‌డం.. అన్నిటి క‌న్నాముఖ్యంగా అమ‌రావ‌తి పై త‌న మాట ఏంట‌నేది చెప్ప‌డం వంటివి అచ్చెన్న‌కు ప్ర‌ధాన స‌వాళ్లుగా ఉన్నాయి. అమ‌రావ‌తి కావాలంటే.. శ్రీకాకుళం వాసుల‌కు ఏం చెబుతారు.? వ‌ద్దంటే.. అమ‌రావ‌తిపై టీడీపీ వ్యూహ‌మే దెబ్బ‌తినే ప‌రిస్థితి ఉంటుంది.. ఇలా అనేకానేక స‌వాళ్లు.. అచ్చెన్న‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. మ‌రి ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తారో.. లేక ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే.. చాల‌నుకుంటారో చూడాలి.