Begin typing your search above and press return to search.

అవినీతిప‌రుడి ఆస్తి మాకొద్దంటున్న భార్య‌పిల్లలు

By:  Tupaki Desk   |   26 Dec 2017 10:19 AM IST
అవినీతిప‌రుడి ఆస్తి మాకొద్దంటున్న భార్య‌పిల్లలు
X
అవినీతిప‌రులను కుటుంబ‌స‌భ్యులు ఏ విధంగా చూస్తారో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. బినామీల పేర్లతో కోట్లకు కోట్లు పోగేసి చివరకు స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని జైలు పాలయిన అబ్దుల్ క‌రీం తెల్గీ గురించి ఆసక్తిక‌ర‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణంతో తెల్గీ కూడబెట్టిన ఆస్తులు తనకు చిత్తు కాగితాలతో సమానమంటున్నారు ఆయన భార్య షాహిదా. జైలుశిక్ష అనుభవిస్తూ అక్టోబర్‌లో తెల్గీ మరణించారు. ఆయన అక్రమ సంపాదన తమకు అక్కర్లేదని కూతురు - అల్లుడు తేల్చిచెప్పారు. బినామీ పేర్లతో తెల్గీ కొన్న ఆస్తులను వదులుకోవడానికి సిద్ధమయ్యారు.

స్టాంపుల కుంభ‌కోణంలో జైలుకు వెళ్లిన తెల్గీ ఆ జైల్లోనే కన్నుమూశాడు. అయితే అతను పోగేసిన సొమ్మును అతని భార్యా - పిల్లలు ఎంజాయ్ చేయ‌డం లేదు. ఆ సొమ్మునంతటినీ దేశానికే ఇచ్చేస్తామని వారి కుటుంబం చెప్తోంది. తెల్గీ చివరి కోరిక ప్రకారం వంద కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేసి.. దేశం కోసం ఉపయోగించాలని ఆమె పూణె కోర్టును కోరారు. కర్ణాటకలో తెల్గీ కుటుంబానికి బినామీ పేర్లతో వ్యవసాయ భూమి - షాపింగ్‌ కాంప్లెక్స్‌ లు - ప్లాట్‌ లు ఉన్నాయి. వాటన్నింటినీ వదులుకుంటామని - ఆ సంపదను దేశాభివృద్ధికి వినియోగించాలని పుణె సెషన్స్‌ కోర్టుకు ఆయన భార్య షాహిదా విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది మిలింద్ పవర్ చెప్పారు. అంతేకాదు అది తెల్గీ చివరి కోరికని చెప్పడం విశేషం.

కాగా, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెల్గిని 2006 జనవరి 17న నకిలీ స్టాంపుల కుంభకోణంలో దోషిగా తేలాడు. అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీకి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2007 - జూన్‌ 28న మరో కేసులో 13 ఏళ్ల శిక్ష ఖరారైంది. అయితే జైలులో శిక్ష అనుభవిస్తుండగానే.. 2017 అక్టోబరు 26న తెల్గీ అనారోగ్యంతో చనిపోయాడు.