Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఓ గ్రామం సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   25 March 2020 10:30 PM GMT
తెలంగాణలో ఓ గ్రామం సంచలన నిర్ణయం
X
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో దాని నివారణకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దాన్ని పట్టణాలు కొంత విస్మరించగా గ్రామాలు మాత్రం పక్కాగా అమలుచేస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రామాలు కూడా తమ గ్రామంలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా తమ గ్రామానికి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నారు. గ్రామ సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా కంపచెట్లు, మొద్దులు, రాళ్లు వేసేసి అడ్డుగా పెడుతున్నారు. దీంతో తమ గ్రామం వారు బయటకు.. వేరే గ్రామం వారు లోపలికి రాకుండా సరిహద్దులో అడ్డుకట్ట వేసి రాకపోకలు నిషేధిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎవరైనా మోసుకొస్తారేమోనని భయాందోళనతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే తెలంగాణలోని ఓ పంచాయతీ మరి ముందుకు వచ్చి గ్రామంలో ఎవరైనా బయటకు వస్తే వారికి రూ. వెయ్యి జరిమానా విధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు 21 రోజులు ఇంటికే పరిమితం కావాలని ఆ పంచాయతీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దని కోరుతున్నారు.

ఆ గ్రామమే తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నజీరాబాద్‌ పంచాయతీ సర్పంచ్‌ నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ పరిధిలో నివసిస్తున్న వారి దగ్గరకు బంధువులు, స్నేహితులు ఇతరులెవరూ రాకూడదని, ఎవరైనా కొత్తగా వస్తే.. ఆ ఇంటి యజమానికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని సర్పంచ్‌ నిర్ణయించారు. తమ గ్రామం.. ప్రజల బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇంకా 20 రోజులు మనకు మనం గృహ నిర్బంధం విధించుకుంటే కరోనా కానరాకుండా పోతుందని భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సర్పంచ్‌ వెల్లడించారు.