Begin typing your search above and press return to search.

మూడు రాజధానులపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కార్

By:  Tupaki Desk   |   8 Aug 2020 12:01 PM GMT
మూడు రాజధానులపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కార్
X
మూడు రాజధానుల విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేందుకు ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదన్న విషయం తాజాగా తన చర్యతో మరోసారి స్పష్టం చేసిందని చెప్పాలి. మూడు రాజధానుల విషయాన్ని త్వరగా తేల్చేయాలన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. మూడు రాజధానులపై వెల్లువెత్తుతున్న ఆందోళనల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.

ఏపీ రాజధాని నిర్మాణంలో కీలకభూమిక పోషించే సీఆర్డీయే రద్దు బిల్లుకు ఆమోద ముద్ర వేయగా.. హైకోర్టు దానిపై ఆగస్టు 14 వరకు స్టేటస్ కో విధించింది. దీంతో.. విశాఖకు రాజధాని తరలింపు తాత్కాలికంగా ఆగింది. అయితే.. విశాఖ తరలింపు విషయంలో ఏ మాత్రం ఆలస్యాన్ని తాను భరించలేనన్నట్లుగా జగన్ సర్కారు తీరు ఉందన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు మెట్లను ఎక్కింది ఏపీ సర్కారు. ఈ నెల 16న విశాఖలో రాజధాని శంకుస్థాపన చేపట్టాలన్న యోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా సుప్రీంను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. మరి.. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేయటం.. మండలిలో దానికి ఎదురుదెబ్బ తగలటం..అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ వద్దకు చేరింది. ఇటీవల ఏపీ గవర్నర్ మూడు రాజధానుల తీర్మానానికి అనుకూలంగా సంతకం పెట్టారు. దీంతో.. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైనట్లేనని భావించారు. ఇంతలో రాజధానికి చెందిన రైతులుపలువురు ఈ అంశంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించటంతో అమరావతిపై స్టేటస్ కోను జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు సుప్రీం తలుపు తట్టింది. మరి.. దేశ అత్యుత్తమ న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.