Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 17: ఆదివాసీ గోండు సింహం కొమురం భీం!

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:44 AM GMT
సెప్టెంబర్ 17: ఆదివాసీ గోండు సింహం కొమురం భీం!
X
అణచివేతను అడ్డుకునేందుకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వస్తారు.. అణగారిన వర్గాల కోసం పుట్టే నాయకుడు తెలంగాణలో కోకొల్లలు.. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఈ నేల ఎంతో మంది మహనీయులకు పురుడు పోసింది. అందులో ఒక విప్లవ వీరుడే మన ఆదివాసీ ముద్దు బిడ్డ 'కొమురం భీం'. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ఆదివాసీ. జల్-జంగిల్-జమీన్ నినాదంతో అడవిలో పుట్టిన ప్రతి ఒక్కటి తమ సొంతమని, వాటిని అనుభవించే హక్కు మనకుందని ఆదివాసీలకు ఒక్కతాటిపైకి తెచ్చి అప్పటి నీజాం రాజుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన గోడు వీరుడు కొమురం భీం.

- పచ్చటి నేల మా సొత్తంటూ..

పచ్చటి దుప్పటి పరిచినట్లుగా అడవులను పుట్టినిల్లుగా ఉన్న ఆదిలాబాద్ బాసిల్లేది. నిజాం కన్ను ఆ నేల పడింది. అడవి బిడ్డల మాన ప్రాణాలు తీయడం, నేలను వారి నుంచి బలవంతంగా గుంజుకోవాలని నిరంకుశ నిజాం సర్కార్ వారిపై నిరంతరం దాడులకు పాల్పడింది. దాడులను ఎదుర్కొనేందుకు నేల 1901, అక్టోబర్ 22న ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లాలలోని సంకేపల్లి గోండు కుటుంబంలో భీంకు పురుడు పోసింది. పసితనం నుంచి అనచివేతను చూసిన కొమురం భీం యవ్వనం వచ్చాక విప్లవంతోనే అనిచివేత అంతమవుతుందని గ్రహించి అందుకు అడవి బిడ్డలను సమాయత్తం చేయాలని సంకల్పించాడు. తన తండ్రి కూడా నిజాం సైన్యం చేతిలో మరణించడం తనను మరింత రగిలించింది. అందరం విల్లంబులు పుచ్చుకొని నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. జల్-జంగల్-జమీన్ నినాదం ఎత్తుకొని నిజాం సైన్యాలను పరిగెత్తించాడు.

-పోరాటంతో మురిసిన నేల

నిజాం చట్టాలను ధిక్కరిస్తూ పోరాటాలకు దిగాలని పిలుపునిచ్చాడు. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టూ, పుట్టపై తమకే హక్కు ఉందని ఇక్కడి నుంచి తమను ఎవరూ వెల్లగొట్టలేరని ఇది మా సామాజిక హక్కు అంటూ నినదించాడు. ప్రధానంగా పశువుల కాపర్లపై నిజాం సర్కార్ వేసిన పన్నును కట్టేది లేదని సందేశాలు పంపాడు. అడవుల్లో అప్పటికే ఉన్న దేశ్‌ముఖ్ లు, దొరలు, జాగీర్దార్లు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. వారంతా అతని పోరాటాన్ని తట్టుకోలేక పట్టణాలకు వలస పోయారు. ఇక తర్వాతి వంతు అడవి సంపదను, తన ఆడబిడ్డల మాన ప్రాణాలను హరిస్తున్న నిజాం సైన్యాలను తనకున్న కొద్దిపాటి గోండు వీరులతో అంతం చేయాలని ప్రణాళికలు వేశాడు. నిజాం సైన్యం చేతిలో తుపాలకులకు ధీటుగా ఉండేందుకు బడిసెలు, విల్లంబులు, బాణాలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఆచరించిన గెరిల్లా యుద్ధాన్ని గోండు వీరులకు వివరించాడు. దీని కోసం ప్రత్యేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన పోరాటంతో నేల మురిసిపోయింది. నిరంకుశ నిజాం సైన్యం వెనకడుగు వేయక తప్పలేదు.

- నమ్మక ద్రోహమే శాపం

ఇప్పటి ఆసిఫాబాద్, జోడేఘాట్ గుట్టలు సాక్ష్యంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాలు చేసిన ఆయన తెగువ అద్భుతం, అసమానం. నిజాం నవాబు కొమురం భీంను ఎలాగైనా అంతం చేయాలని, అప్పుడే అడవులు, అక్కడి సంపద తన సొంతం అవుతుందని గ్రహించాడు. కుర్దు పటేల్ తో భీంను కార్యకలాపాలను తెలుసుకున్నాడు. కుర్దు ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940, అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లో భీం ఉన్న స్థావరాన్ని ముట్టడించింది. కొమురం భీంతో పాటు 12 మంది ఆదివాసీ వీరులను పాశవికంగా హతమార్చింది. వీరి అమరత్వంతో పోరాటాన్ని అణచివేశామన్న నిజాంకు దాన్ని పూర్తిగా అణిచివేయలేమని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అని తెలుసుకోలేకపోయాడు. ఈ పోరాట స్ఫూర్తినే కనబరుస్తూ ఎంతో మంది వీరులు తెలంగాణ విమోచన పోరాటానికి పిలుపునిచ్చారు. 'బండెనక బండి కట్టి.. పదహార బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతవు కొడుకో నైజాము సర్కరోడా' అంటూ గలమెత్తి నిజాం మెడలు వంచేలా పోరాడారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.