Begin typing your search above and press return to search.

ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుకు అరుదైన గుర్తింపు!

By:  Tupaki Desk   |   7 Oct 2022 9:30 AM GMT
ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుకు అరుదైన గుర్తింపు!
X
తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రి సమీపంలో ఉన్న ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీకి అరుదైన గుర్తింపు ల‌భించింది. బ్రిటిష‌ర్ల ప‌రిపాల‌న‌లో కాట‌న్ దొర ఈ బ్యారేజీని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యారేజీ నిర్మాణం ద్వారానే ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే అన్న‌పూర్ణ‌గా నిలిచాయి. ఈ బ్యారేజీ నిర్మించి రైత‌న్న క‌ష్టాల‌ను తీర్చిన కాట‌న్‌కు కృత‌జ్ఞ‌త‌గా ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ప్రపంచస్థాయిలోనే అరుదైన గుర్తింపు ల‌భించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ చోటు సంపాదించింది. ప్ర‌పంచ వార‌స‌త్వ నీటిపారుద‌ల క‌ట్ట‌డంగా దీన్ని ఆస్ట్రేలియా గుర్తించింది. మొత్తం మ‌న‌దేశంలో నాలుగు సాగునీటి నిర్మాణాల‌కు ఈ అవార్డులు ల‌భించాయి. అందులో ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ తొలి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.

ఈ మేర‌కు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

పురాతనకాలం నుంచి పంట పొలాలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టులను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్(ఐసీడీసీ) గుర్తిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కాట‌న్ బ్యారేజీని ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ నిర్మాణంగా ప్ర‌క‌టించాల‌ని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన ఐసీడీసీ ధవళేశ్వరం బ్యారేజ్ కు వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇచ్చింది.

కాగా ధవళేశ్వరం బ్యారేజీకి ప్రపంచస్థాయిలో అరుదైన గుర్తింపు ల‌భించ‌డంపై ప్రభుత్వ వర్గాలు ఒక ప్ర‌క‌ట‌న‌లో సంతోషం వ్య‌క్తం చేశాయి. వారసత్వ నీటిపారుద‌ల క‌ట్ట‌డంగా గుర్తించడంతో కాటన్ బ్యారేజ్ కు అసలైన గుర్తింపు లభించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

కాగా ప్రపంచవ్యాప్తంగా 24 ప్రాజెక్టులను వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించింది. అందులో భారత్ నుంచి నాలుగు చోటు ద‌క్కించుకున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ధవళేశ్వరం ప్రాజెక్టు నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడులోని లోయర్ అనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికల్య స్థానం ద‌క్కించుకున్నాయి.

తొలి స్థానంలో నిలిచి అవార్డు ద‌క్కించుకున్న‌ ధవళేశ్వరం ప్రాజెక్టును రాజమండ్రికి సమీపంలోని గోదావరి నదిపై నిర్మించారు. ఈ బ్యారేజ్ క్రింద 10,13,376 ఎకరాలకు సాగునీరు అందుతోంది. అలాగే 833 గ్రామాలకుపైగా తాగునీటిని అందిస్తున్నారు. గ‌రిష్ట‌ నీటి నిల్వ 2.931 టీఎంసీలుగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.