Begin typing your search above and press return to search.

తామేం తప్పు చేశామో చెప్పిన ఇటలీ యువకుడి లేఖ

By:  Tupaki Desk   |   20 March 2020 12:30 AM GMT
తామేం తప్పు చేశామో చెప్పిన ఇటలీ యువకుడి లేఖ
X
అందమైన.. ప్రశాంతమైన దేశంగా.. అభివృద్ధికి చిరునామా ఉంటూ ఎంతో మందికి కలల ప్రపంచంగా చెప్పుకునే బుజ్జి దేశం ఇటలీ. ఇప్పుడా దేశం పేరు వింటేనే గజ గజలాడిపోతున్నారు. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాకు మించిన అత్యధిక కరోనా మరణాలు ఈ దేశంలోనే చోటు చేసుకున్నాయి. కరోనాకు అతి పెద్ద బాధితురాలిగా మారిన ఈ దేశం ఇప్పుడెలా ఉంది? ఈ దేశంలో అందమైన నగరాలుగా చెప్పే మిలన్ లో ఇప్పుడెలాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు తప్పు ఎక్కడ జరిగింది? అంత అభివృద్ధి చెందిన దేశంలో కరోనా అంతలా ఎందుకు వ్యాపించింది? అంతమంది ఎందుకు బలయ్యారు? లాంటి విషయాల్ని తాజాగా ఆ దేశానికి చెందిన పౌరుడొకరు లేఖ రూపంలో వెల్లడించి భోరుమంటున్నాడు.

తమ మాదిరి తప్పు చేయొద్దని ప్రపంచాన్ని వేడుకుంటున్నాడు. తాము చేసిన పొరపాట్ల నుంచి మిగిలిన వారు పాఠాలు నేర్చుకోవాలని.. తమ మాదిరి చీకట్లోకి కూరుకుపోవద్దని వేడుకుంటున్నాడు. అతడి లేఖ ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది. చాలామందిని ఆలోచించేలా చేస్తోంది. ఆ లేఖలోని అంశాల్ని స్వేచ్ఛానువాదం చేస్తూ..కొన్ని కీలకమైన అంశాల్ని ప్రస్తావిస్తే..

‘‘మాది అందమైన దేశం. ప్రశాంతమైన జీవితం. ఇక్కడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇటలీ పౌరుడిగా మొన్నటి వరకూ ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రపంచంలోనే అందమైన నగరంగా చెప్పే మిలాన్ ఇప్పుడు చిమ్మ చీకట్లో ఉంది. ఈ నగరంలోని ప్రజల జీవితం మొత్తం మారిపోయింది. మాకు మేముగా ఇప్పుడు ఒక చీకటి చెరసాలను నిర్బంధించుకున్నాం. వీధుల్లోకి వెళ్లలేం. పొరపాటున వెళితే పోలీసులు వచ్చి తీసుకెళ్లి జైల్లో పడేస్తారు షాపులు.. ఆఫీసులు.. వీధులు.. అన్ని మూతబడ్డాయి. మాకిప్పుడు అనిపిస్తోంది ఇదే..యుగాంతమేమోనని. ఇంక మా జీవితాలు ముగిసిపోయిన అధ్యాయాలేమోనని. ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని మేం ఎప్పుడూ అనుకోలేదు’’

‘‘ఈ రోజు ఇలాంటి పరిస్థితికి కారణం మేమే. పది రోజుల క్రితం మా ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. ఈ రోజు మా దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వైరస్ వ్యాపిస్తుందని.. బయటకు వెళ్లొద్దని చెబితే మేం వినలేదు. సెలవులు ఇస్తే.. విహారయాత్రలకు వెళ్లాం. సినిమాలకు వెళ్లాం. షికార్లు తిరిగాం. పార్టీలు చేసుకున్నాం. బజార్లలో కూర్చొని గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ కాలం గడిపాం. అదెంత తప్పో ఇప్పుడు మాకు అర్థమైంది. ప్రభుత్వం చేసిన సూచనల్ని తేలికగా తీసుకున్నాం. ఆ రోజు మాకు తెలీదు. మేం చేస్తున్నది ఎంత పెద్ద తప్పో. దాని ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. రోజుకు రెండు వందల మంది చనిపోతున్నారని చెబుతున్నారు. ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి’’

‘‘ఇటలీలో ఇప్పుడు మందులు లేవు. వైద్యులు ఉన్నా.. కరోనా బాధితుల్ని ఉంచటానికి తగిన స్థలం లేక 80 ఏళ్లకు పైబడిన వారికి కరోనా సోకితే సజీవంగానే తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మేం చేసిన తప్పులే. గతంలో ఇంకొకరికి సాయం చేసే స్థితిలో ఉండేవాళ్లం. ఇప్పుడు ప్రపంచం చేసే సాయం కోసం దేహి అని అర్థిస్తున్నాం. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సెలవులు ఇస్తే.. వాటిని విందులు.. వినోదాల పేరుతో విచ్చలవిడిగా తిరగటానికి వాడాం. మాలాంటి పరిస్థితి ప్రపంచంలో మరే దేశానికి రాకూడదు. అందరూ మీ ప్రభుత్వాలు చేసే సూచనల్ని తూచా తప్పకుండా పాటించండి’’

‘‘విందులు.. వినోదాలు.. జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సెలవులు వచ్చాయని తీర్థయాత్రలు లాంటివి చేస్తే ఒక పనైపోతుందని అస్సలు అనుకోవద్దు. అలా చేస్తే ప్రాణాలకే ముప్పు అన్నది మర్చిపోకండి. అందమైన అభివృద్ధి చెందిన ఇటలీ దేశ ప్రయాణం ఇప్పుడెలా మారిందో మీ అందరూ చూస్తున్నారు. మాలాంటి దయనీయమైన పరిస్థితి మీ దేశానికి కలిగేలా చేయకండి’’ అని లేఖలో వేడుకున్నాడు. ఇదంతా చదివిన వారు.. ఇటలీ పరిస్థితికి తీవ్రమైన వేదనకు గురి అవుతున్నారు.