Begin typing your search above and press return to search.

ఆ ఎంపీలు చాలా స్పెష‌ల్ గురూ.. కానీ, టికెట్లే డౌట్‌..?

By:  Tupaki Desk   |   4 Dec 2022 9:32 AM GMT
ఆ ఎంపీలు చాలా స్పెష‌ల్ గురూ.. కానీ, టికెట్లే డౌట్‌..?
X
వైసీపీలో 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక‌రు రెబ‌ల్‌గా మారిపోయారు. స‌రే, ఈయ‌న‌ను ప‌క్క‌న పెడితే.. మిగిలిన 21 మంది ఎంపీల్లో ఆరుగురు చాలా చాలా స్పెష‌ల్‌గా మారిపోయారు. వీరు మీడియా ముందుకురారు. అలాగ‌ని ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా ఉండ‌రు. కానీ, ప‌నులు మాత్రం చేస్తున్నారు. కానీ, ఇది ఏం లాభం? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప‌ని చేయాలి, ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా ఉండాల‌నేది పార్టీ నినాదం.

కానీ, ఎటొచ్చీ వీరు మాత్రం ప‌నిచేస్తున్నారు. కానీ, క‌నిపించ‌డ‌మే లేదు. వీరిలో మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి, తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, అదేవిధంగా అర‌కుఎంపీ గొట్టేటి మాధ‌వి. వీరికి సీఎం జ‌గ‌న్‌తోను పార్టీలోని కీల‌క నేత‌ల‌కు మంచి రెపో ఉంది. కానీ, ఎటొచ్చీ.. ప్ర‌జ‌ల‌కు మాత్రం క‌నెక్ట్‌కాలేక పోతున్నారు.

పోనీ పార్టీలో అయినా.. త‌మ‌దైన ముద్ర వేస్తున్నారా? అంటే అస‌లు నాయ‌కుల‌కు వీరు క‌డుదూరంగా ఉంటున్నారు. ప‌ని అయితే చేస్తున్నారు. ఎంపీ లాడ్స్ ఇటీవ‌ల వ‌చ్చిన త‌ర్వాత ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు చేయిస్తున్నారు.

ఇటీవ‌ల అర‌కులో అతి పెద్ద ప్రాజెక్టును ఎంపీ మాధ‌వి ఎంచుకున్నారు.కానీ, క్రెడిట్ మాత్రం ఎమ్మెల్యే కొట్టే శారు. దీనికి కార‌ణం.. ఆ ప్రాజెక్టుకు తానే నిధులు ఇచ్చాన‌ని చెప్పుకొని క్రెడిట్ సంపాయించుకోవ‌డంలో ఆమె వెనుక బ‌డ్డారు.

ఎంపీ బాల‌శౌరి కూడా ప‌నులు చేస్తున్నారు. కానీ, ఆయ‌న మాస్ కాదు క్లాస్‌. దీంతో ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఏం చేస్తున్నారో తెలియ‌దు. తిరుప‌తి ఎంపీ ఇంకా బాగానే చేస్తున్నారు. కానీ, ఏం లాభం.. చేసింది చెప్పుకోవ‌డానికి సిగ్గుప‌డుతున్నారు. మీడియా అంటేనే ఆయ‌న వెనుకంజ వేస్తున్నారు.

అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా రాజంపేట‌ను తీర్చ‌దిద్దుతున్నారు.కానీ, ఆయ‌న కూడా మీడియా ముందుకు ఎప్పుడూ రారు. దీంతో వీరు ప‌నిచేస్తున్నా.. పేరు మాత్రం ద‌క్క‌డం లేదు. దీంతో వీరి పరిస్థితి ఏంటో అధినేత కు కూడా అర్ధం కావ‌డం లేద‌ట‌.