Begin typing your search above and press return to search.

జగన్ మీద నమ్మకం లేదంటున్న చెల్లెమ్మ...?

By:  Tupaki Desk   |   26 Sep 2022 8:30 AM GMT
జగన్ మీద నమ్మకం లేదంటున్న చెల్లెమ్మ...?
X
ఏపీలో కోట్లాది మంది అక్క చెల్లెమ్మలకు తాను సొదరుడిని అని జగన్ చెప్పుకుంటారు. ముఖ్యమంత్రిగా తాను ఒక అన్నగా, తమ్ముడిగా వారికి అండగా ఉంటాను అని పదే పదే చాటుకుంటారు. అయితే జగన్ కి తోడబుట్టిన చెల్లెళ్ళు ఉన్నారు. అందులో సొంత చెల్లెలు వైఎస్ షర్మిలమ్మ అయితే జగన్ మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడ హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల ఆమె ఆక్షేపించారు. అన్న చేసింది తప్పు అని కుండబద్ధలు కొట్టారు.

ఇక తెలంగాణాలో సొంతంగా పార్టీని పెట్టుకున్న షర్మిలమ్మ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సమయం దొరికిన ప్రతీసారి జగన్ మీదనే విమర్శల బాణాలు వేస్తూ వస్తున్నారు. మరో వైపు చూస్తే జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకాను దారుణంగా హత్య చేశారు, ఆ నిందితులను పట్టుకుని శిక్షితే తన తండ్రి ఆత్మకు శాంతి ఉటుందని సునీత బలంగా నమ్ముతున్నారు.

అయితే ఏపీలో ఉన్నది అన్న జగన్ సర్కారే కానీ మూడేళ్ళు పైదాటినా వివేకా హత్య కేసు మాత్రం ఎటూ తెమలడంలేదు. దాంతో సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు సరిగ్గా చేయడం లేదని ఆమె సీబీఐ విచారణకు కోరుకున్నారు. సీబీఐ విచారణ జరుగుతున్నా నత్తనడగానే ఉంది. ఎందుకంటే ఏపీ పోలీసులు సహకరించడం లేదు అన్న అనుమానాలు ఆమెకు ఉన్నాయని చెబుతున్నారు.

దాంతో ఆమె లేటెస్ట్ గా సుప్రీం కోర్టు లో మరో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనకు ఈ కోశానా నమ్మకం లేదని,అందువల్ల తన తండ్రి వివేకా హత్య కేసును అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని ఆమెపిటిషన్ లో పేర్కొన్నారు. అంటే జగన్ మీద ఏ మాత్రం నమ్మకం లేదని సొంత చెల్లెలే ఇక్కడ చెప్పింది అన్న మాట. మరి ఏపీలో అందరికీ అన్నగా ఉంటానని చెబుతున్న జగన్ మీద సొంత చెల్లెలే అనుమానాలు వ్యక్తం చేయడం అంటే అది నిజంగా ఘాటు విమర్శగానే చూడాలి మరి.

ఇక్కడ సునీతమ్మ అనుమానం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోని నిందితుల్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వారు కావడమే. దాంతో వైఎస్ సునీతపై జగన్ సర్కార్ మీద కొడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, తండ్రి హత్య కేసులో అనుమానితులలో ఒకరిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేరుని కూడా ఆమె చేర్చారు. ఒక విధంగా సునీతమ్మ జగన్ సర్కార్ మీదనే పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నరు అనుకోవాలి.

అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే అసలు దోషులు బయటకు వస్తారని ఆమె అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ తరచూ దుష్ట చతుష్టయం అంటూ విమర్శలు చేసే వాటిలో ఒకటిగా ఉన్న ఆంధ్రజ్యోతికి ఆమె ఇంతకు ముందు కూడా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇపుడు కూడా లేటెస్ట్ గా మరో ఇంటర్యూ ఇచ్చారు. అయితే వైసీపీ పెద్దల అదృష్టం బాగుందేమో ఆమె తన తండ్రి హత్య కేసు మీద జగన్ సర్కార్ మీద కానీ మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తిని చూపించలేదు.

దాంతో అధికార పక్షం కొంతవరకూ ఊపిరి పీల్చుకుని ఉండవచ్చు. కానీ తరచూ టీడీపీ అనుకూల మీడియా టచ్ లోకి సునీతమ్మ వెళ్ళడం మాత్రం ఆమెకూ వైసీపీ పెద్దలకు మధ్య దూరాన్ని బాగా పెంచుతోంది అనే అంటున్నారు. ఇక తన బాల్యం, తన చదువు, తన వైద్య వృత్తి కుటుంబ సంబంధాల‌ మీదనే వైఎస్ సునీత ఆంధ్రజ్యోతికి తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.

ఇక సునీతమ్మ రాజకీయాల్లోకి వస్తారా అని ఆ మీడియా ప్రశించినా ఆమె పెద్దగా ఆసక్తిని చూపించినట్లుగా అనిపించలేదు. అయితే దీనికి ఆమె అస్పష్టంగా సమాధానం చెబుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లో ప్రవేశించే వీలు ఉన్నా ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తానికి వివేకా కేసు పొరుగు రాష్ట్రానికి బదిలీ అయితే మాత్రం ఏపీలో జగన్ సర్కార్ కి అది తీవ్రమైన విమర్శగానే అంతా చూస్తారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.