Begin typing your search above and press return to search.

మీ ఎమ్మెల్యే పక్కా నాన్ లోకల్... వింటున్నారా...?

By:  Tupaki Desk   |   23 Sep 2022 11:19 AM GMT
మీ ఎమ్మెల్యే పక్కా నాన్ లోకల్... వింటున్నారా...?
X
మీ ఎమ్మెల్యే పక్కా నాన్ లోకల్. ఆయన ఉండేది హైదరాబాద్. సో ఆయన హైదరాబాద్ కి లోకల్ కానీ కుప్పానికి మాత్రం దూరం. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు, ఓటు కూడా లేదని జగన్ ఎద్దేవా చేశారు. కుప్పం తన ఊరు అని అని ఏనాడు బాబు భావించలేదు. ఎన్ని సార్లు సీఎం అయినా కుప్పానికి ఏమీ చేసింది లేదు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి భారీ సెటైర్లు వేశారు.

హైదరాబాదు తనకు ముద్దు అని ఆయన అనుకున్నారు. హైదరాబాద్ లో ఇంద్రభవనం కట్టుకున్నాడు, కుప్పంలో మాత్రం ఇల్లు కట్టలేదని ఎత్తి చూపారు. బీసీలకు న్యాయం చేశామని చెబుతారు చంద్రబాబు కానీ బీసీల మీద ప్రేమ ఉంటే కుప్పం నుంచి మొదలుపెడితే ఏపీ అంతటా అన్ని చోట్లా అన్యాయమే చేశారని విమర్శించారు. కుప్పం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాదు, కుప్పం బీసీల సీటు కుప్పంలో అత్యధికులు బీసీలకు ఇవ్వకుండా బాబు లాక్కున్నారని జగన్ కొత్త విషయం చెప్పుకొచ్చారు.

టీడీపీ పుట్టిన తరువాత 1983 నుంచి 2019 దాకా కుప్పం ఒక్కసారి కూడా కుప్పం బీసీలకు ఈ సీటు ఇవ్వలేదు, ఇది బాబు మార్క్ సామాజిక న్యాయమని జగన్ పేర్కొన్నారు. బీసీల కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు. బీసీలను వాడుకునే వారికి చెక్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆయన కుప్పానికి రారు, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారో పట్టించుకునేందుకు కూడా బాబు ఇష్టపడరు, తనను పద్నాలుగేళ్ళు సీఎం గా చేసిన ప్రజలను గాలికి వదిలేశారని జగన్ దుయ్యపెట్టారు. వెన్నుపోటుకు దొంగఓట్లకు చంద్రబాబు పెట్టింది పేరు అని నిందించారు. కుప్పంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, మెడికలు కాలేజ్ లేదు అదేనా బాబు చేసిన నిర్వాకం అని జగన్ విమర్శించారు.

ఆయన కుప్పం ప్రజలు అమాయకులు అని ఇలా చేస్తున్నారని చెప్పారు. అయితే ఇపుడు మాత్రం కుప్పం ప్రజలు ఇపుడు అభివృద్ధి వైపు సాగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కుప్పం ప్రజలు 2019 ఎన్నికల తరువాత జరిగిన మునిసిపల్, జెడ్పీ,ఎంపీపీ, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ కి క్లీన్ స్వీఎప్ చేసి బాబుకు గుణపాఠం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి ఆలోచన చేసి నగదు బదిలీ పధకానికి ఓటు వేశారని అన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబు డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు, డీపీటీ అంటే దోచుకో పంచుకో తినుకో అన్న దానికి యాంటీగా ఓట్లేసారు అని అన్నారు. వైసీపీ ఏలుబడిలో కుప్పం అభివృద్ధి బాగా సాగుతోందని అన్నారు. మరో ఆరునెలల్లో నద్రీ నీవా కాలువ పనులు చేస్తామని హామీ ఇచ్చారు.

కుప్పాన్ని మునిసిపాలిటీగా చేసి 66 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. 55 ఏళ్ళుగా ఒక కలగా మిగిలిన ఆర్డీవో ఆఫీస్ ని కూడా వైసీపీ ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వం అని చెప్పారు. రెడ్డిపల్లి, రాపకుప్పంలో విద్యుత్ సబ్ స్టేషన్లు ఇచ్చింది కూడా వైసీపీ అని ఆయన గుర్తు చేశారు. కుప్పంలో రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేశామని, 10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ భవనాలు పూర్తి చేసింది వైసీపీయే అని ఆయన గుర్తు చేశారు.

ఇక ఒకేషనల్ జూనియర్ కళాశాల పనులు పూర్తి చేశామని, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని ఆయన గుర్తు చేశారు. ఇంకా అనేక పనులు చేపట్టామని అన్నారు. నేరుగా బటన్ నొక్కి కుప్పానికి మూడేళ్ళుగా 866 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇతర పధకాలు అన్నీ కూడా చూసుకుంటే మరో 280 కోట్ల రూపాయలు కేవలం కుప్పానికే ఇచ్చమని ఆయన చెప్పారు. టోటల్ గా కుప్పనికే 1149 కోట్ల రూపాయలు ఇచ్చామని జగన్ వివరించారు. ఈసారి కుప్పంలో వైసీపీకి చాన్స్ ఇవ్వాలని ఆయన కోరారు

చంద్రబాబుకు సొంత మామ మీద ఎలాంటి ప్రేమ ఉందో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేసారు. ఆయనకు కుప్పం మీద వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉందని జగన్ సెటైర్లు వేశారు. సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానం తప్పు అని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల వారికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఆయన కోరారు. భరత్ ని గెలిపించి కుప్పం తల రాత మార్చాలని జగన్ కోరారు. భరత్ ని మంత్రిగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.