Begin typing your search above and press return to search.

రఘురామ‌కృష్ణ‌రాజుకు మ‌రో చిక్కు!

By:  Tupaki Desk   |   3 July 2022 2:50 PM GMT
రఘురామ‌కృష్ణ‌రాజుకు మ‌రో చిక్కు!
X
వైఎస్సార్సీపీ న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ ఆ త‌ర్వాత పొడ‌సూపిన విభేదాల‌తో వైఎస్సార్సీపీకి దూర‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి ఏకుకు మేకులా మారి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైఎస్సార్సీపీ నేత‌ల నుంచి అంతే ధీటుగా ర‌ఘురామ‌పై కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు రఘురామకృష్ణరాజు సిద్ధ‌మ‌వుతున్నారు. జూలై 4న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కాళ్ల మండ‌లం పెదఅమిరంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ 30 అడుగుల అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎంపీగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌బోతున్నారు.

మ‌రోవైపు రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా వివిధ దళిత సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోకి అడుగు పెట్టకముందే దళితులకు ఎంపీ బేషరతు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దళితులను, ఉద్యోగులను కించపరిచేలా ఎంపీ వ్యాఖ్యలు చేశారని ద‌ళిత నేత‌లు ఆరోపిస్తున్నారు. దళిత క్రైస్తవులపై కూడా ఎంపీ ర‌ఘురామ‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు.

ద‌ళిత నేత‌లు ఇప్పటికే ఎంపీ ర‌ఘురామ‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయన భీమ‌వ‌రం రాగానే ఎంపీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా క్రైస్తవులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఎంపీ భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న హీట్ పెంచుతోంది.

మ‌రోవైపు ప్ర‌ధాని మోదీ రాక‌ను పుర‌స్క‌రించుకుని భీమ‌వ‌రంలో ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర భ‌ద్ర‌తా ద‌ళాలు ముమ్మ‌ర త‌నిఖీలు చేస్తున్నాయి. 16 ఎక‌రాల్లో ల‌క్ష మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యేందుకుగా వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి సంద‌ర్భంగా ఆజాదీ అమృత్ మ‌హోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామ‌రాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్క‌రించనున్నారు.

వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం టౌన్ పరిసరాల వరకు ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్దం చేశారు. ప్రధాని రాకపోకలకు వీలుగా నాలుగు హెలిప్యాడ్లు సిద్దం అయ్యాయి. ప్రధాని వేదికతో పాటుగా సమీపంలోనే మరో వేదిక సిద్దం చేశారు. ఆ వేదికపైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.