Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ జగన్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు కరుణించినట్టేనా?

By:  Tupaki Desk   |   8 Jun 2023 9:36 AM GMT
ఎన్నికల వేళ జగన్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు కరుణించినట్టేనా?
X
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మరోమారు అధికారం సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్‌ ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం పెంచారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో వారిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నట్టు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌)ను ప్రవేశపెట్టకుండా గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)ను అమలు చేస్తామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. జీపీఎస్‌ తో ఓపీఎస్‌ కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలైన ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్, ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం సమర్థించడం విశేషం. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి తీరిపోయినట్టేనని అంటున్నారు.

ఇక ప్రభుత్వం ఓపీఎస్‌ స్థానంలో ఇస్తామంటున్న జీపీఎస్‌ ప్రకారం.. ఉద్యోగి రిటైర్‌ అయ్యేనాటికి చివరి నెలలో ఉన్న మూల జీతం (బేసిక్‌ పే)లో 50 శాతంతోపాటు ప్రతి ఆర్నెళ్లకు ఒక కరువు భృతి (డీఆర్‌)ను పెన్షన్‌ గా అందిస్తారు. డీఆర్‌ ఏటా రెండుసార్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) కంటే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌ ను గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) అందిస్తుందని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు వివరించింది. జీపీఎస్‌ ను స్వాగతిస్తూ ఉద్యోగ సంఘాలు ప్రకటన కూడా విడుదల చేశాయి. దీంతో ప్రభుత్వం పెద్ద తలనొప్పిని వదిలించుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే జీపీఎస్‌ తోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు 2014 జూన్‌ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న 10 వేల మందిని క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రిమండలి తీర్మానించింది.

అయితే జగన్‌ ఎన్నికల ముందు, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు సీపీఎస్‌ రద్దు మాత్రం చేయలేకపోయారు. ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం చెబుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఉద్యోగులు కోరుకుంటున్నట్టు ఓపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెడితే 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుందని పేర్కొంటోంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరతాయని.. దీంతో ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌ కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ ను తీసుకొచ్చామని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నా మెజార్టీ ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం చెబుతున్న జీపీఎస్‌ పై హర్షాన్ని ప్రకటించడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

మరోవైపు ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను కూడా గతంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయించింది. దీంతో ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా మొత్తానికి ఎన్నికల వేళ జగన్‌ ప్రభుత్వం తమకు ఇబ్బంది అవుతుందని అనుకునే వర్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టి సారించింది. ఓపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ ను ప్రవేశపెట్టింది. తద్వారా చాలావరకు ఉద్యోగుల్లో తమపై ఉన్న అసంతృప్తిని తగ్గించుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీపీఎస్‌ విధానం ఇలా..

ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్‌ ఫండ్‌ కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌ ఫండ్‌ లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్‌ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. అయితే ఇదంతా మార్కెట్‌ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌ కూ గ్యారెంటీ ఉండదు. బేసిక్‌ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు.

జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా..

సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇందులోనూ సీపీఎస్‌ లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం తన పెన్షన్‌ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుందని వివరిస్తున్నాయి. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌ గా అందుతుంది. సీపీఎస్‌ తో పోలిస్తే పెన్షన్‌ 150 శాతం అధికంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.