Begin typing your search above and press return to search.

చంద్రబాబు వెన్నులో వణుకు..జగన్ మాస్టర్ ప్లాన్

By:  Tupaki Desk   |   29 Oct 2020 9:30 AM GMT
చంద్రబాబు వెన్నులో వణుకు..జగన్ మాస్టర్ ప్లాన్
X
కొడితే ఏనుగు కుంభస్థలంపైనే కొట్టాలన్న తీరుగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ముందుకెళ్తున్నారు. టీడీపీని గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన ఆయన ఇప్పుడు టీడీపీ అధినేతను సొంత ఇలాకాలో ఓడించి దారుణంగా పరాభవించాలని స్కెచ్ గీస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

గత చంద్రబాబు హయాంలో కనీసం సొంత నియోజకవర్గం కుప్పంను కూడా అభివృద్ధి చేసుకోలేని చంద్రబాబు పాలన దక్షతపై ఇప్పుడు విల్లు ఎక్కుపెట్టారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయిన చంద్రబాబుకు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఇంకా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది.

ఇన్నాళ్లు కుప్పం తనకు పెట్టని కోట అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆ కోటకు బీటలు వారేలా అభివృద్ధితో కొడుతున్నారు జగన్. కుప్పంలో క్షేత్రస్థాయిలో చంద్రబాబు చేసింది శూన్యమని అర్థం కావడంతో ఇప్పుడు జగన్ భారీ స్టెప్ వేశారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బ్రాంచ్ కెనాల్ పూర్తి చేస్తున్నారు. అది పూర్తయితే టీడీపీ కథ కంచికి చేరినట్టేనని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ పాలనలో కుప్పంను అభివృద్ధి చేస్తూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని.. వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ స్కెచ్ గీశారు.

జగన్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులైన పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే చంద్రబాబులో సైతం ఆందోళనకు కారణమవుతోంది.

30 ఏళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినా సీఎంగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలినా కూడా తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేకపోయారన్న విమర్శ అక్కడి ప్రజల్లో ఉంది. కనీసం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేయలేకపోయారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేయడంతోపాటు గతంలో వినియోగించని రూ.14 కోట్లతో అండర్‌ డ్రైనేజీ పనులు చేపట్టింది. చంద్రబాబు హ యాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక పనులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి త్వరితగతిన పూర్తి చేయిస్తుండడంతో టీడీపీ వెన్నులో వణుకు మొదలైంది. ఈ అభివృద్ధితో భవిష్యత్‌లో కుప్పం కూడా వైఎస్సార్‌ సీపీ ఖాతాలోకే వెళ్లిపోవడం ఖాయమని అక్కడి నాయకులు అంటున్నారు.