Begin typing your search above and press return to search.

టీడీపీ అక్ర‌మాలను త‌ప్పుబ‌ట్టిన కాగ్‌: ‌2017-18 నివేదిక బ‌హిర్గ‌తం

By:  Tupaki Desk   |   18 Jun 2020 2:30 PM GMT
టీడీపీ అక్ర‌మాలను త‌ప్పుబ‌ట్టిన కాగ్‌: ‌2017-18 నివేదిక బ‌హిర్గ‌తం
X
ఐదేళ్ల పాటు పాలించి అనంత‌రం అధికారానికి టీడీపీ దూర‌మైంది. అప్ప‌టి నుంచి ఆ పార్టీకి గండం ఏర్ప‌డింది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌త ఏడాది పాల‌న‌కు సంబంధించిన కాగ్ నివేదిక విడుద‌లయ్యింది. ఈ నివేదిక‌లో గ‌త ఏడాది పరిపాల‌న‌లో ఉన్న టీడీపీ అవినీతి, అక్ర‌మాల‌ను తెలిపింది. ఈ సంద‌ర్భంగా 2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్‌ నివేదిక విడుదలైంది. 2017-18లో చేబదుళ్లు (వేస్‌ అండ్‌ మీన్స్‌), ఓవర్‌ డ్రాఫ్ట్‌లే ఉన్నాయని వివ‌రించింది.

ఆర్థిక నిర్వహణలో అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని కాగ్ తప్పుబట్టింది. అప్పులు తెచ్చినా దుబారా చేయడంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర దెబ్బ తీసిందని కాగ్ తెలిపింది. 2018 మార్చి వ‌ర‌కు అప్పులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.2,23,706 కోట్లకు పెరిగాయని వెల్ల‌డించింది. అయితే చేసిన అప్పుల మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని కాగ్ స్పష్టం చేసింది. ఈ అప్పులతో పాటు రిజర్వ్‌ బ్యాంకు నుంచి చేబదులుగా ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రూ.45,860.75 కోట్లు తీసుకొని.. వాటిని సకాలంలో చెల్లించలేద‌ని పేర్కొంది. అయితే వాటికి స‌కాలంలో చెల్లించక‌పోవ‌డంతో రూ.44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందని కాగ్ ఎత్తిచూపింది.

2017-18లో రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కాగ్ అధ్యయనం చేసి శాసనసభకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక‌లో 2015-16 నుంచి 2017-18 మధ్య కాలంలో ద్రవ్యలోటును అదుపు చేయడంలో విఫలమైందని కాగ్ తెలిపింది. అప్పులు చేసి ఆస్తులు కల్పించాల్సిన ప్ర‌భుత్వం దుబారా ఖర్చులు చేసి.. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేసిందని వివ‌రించింది. మార్చి 2018 వ‌ర‌కు భారం రూ. 2,23,706 కోట్లకు పెరిగిందని.. తీసుకున్న రుణాలతో పోలిస్తే తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్పత్తి 2016-17లో 18.27 శాతం నుంచి 2017-18లో 22.51 శాతానికి పెరిగిందని వివ‌రించింది. కొత్తగా చేసిన అప్పులను పాత అప్పులు తీర్చడం కోసం మళ్లించారని.. దీంతో వ‌చ్చే ఏడేళ్లలో తీర్చాల్సిన రుణం రూ.91,599.32 కోట్లకు పెరిగిందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ నివేదికలో శాఖ‌ల వారీగా కాగ్ నివేదిక విడుద‌ల చేసింది.

కేటాయింపులు.. ఖ‌ర్చులు
- రెవెన్యూ కేటాయింపుల్లో క్రీడలు, యువజన సేవల శాఖకు 2017-18లో రూ.8,44.59 కోట్లు కేటాయించగా రూ.295.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.549.04 కోట్లు మిగిలాయి.
- మున్సిపల్‌ శాఖకు రూ. 5,014.09 కోట్లు కేటాయించగా.. రూ. 3,719.53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ. 1,294.56 కోట్లు మిగిలాయి.
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 16,787.73 కోట్లు కేటాయించగా రూ. 13,272.25 కోట్లు ఖర్చు చేయ‌గా మిగులు రూ.3,515.48 కోట్లు.

భారీగా కేటాయింపులు చేసి కేటాయింపుల‌కు అనుగుణంగా ఖ‌ర్చు చేయ‌లేక‌పోయారు. మొత్తం 10 శాఖలకు 91,050.7 కోట్లు కేటాయించి రూ.66,874.7 కోట్లు మాత్ర‌మే ఖర్చు చేశారు. అంటే రూ.24,175.96 కోట్లు ఖర్చు చేయకుండా మిగిలాయి. 2017-18 సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్‌లో మొత్తం అన్ని శాఖలకు కేటాయించిన నిధుల కంటే రూ.34,602.10 కోట్లు త‌క్కువ ఖ‌ర్చు చేశారు.

పై లెక్క‌లు ఆ విధంగా ఉండ‌గా పంచాయతీరాజ్‌ శాఖ రోడ్ల నిర్మాణంలో అక్ర‌మాలు చోటుచేసుకుంద‌ని కాగ్ త‌ప్పుబ‌ట్టింది. గత ప్రభుత్వ హయాంలో రూ.180.32 కోట్లు ఖర్చు చేసి 352 కిమీ మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించగా కేటాయించిన నిధుల్లో 99.50 శాతం (రూ.179.41 వెచ్చించి కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే పూర్తి) చేశార‌ని తెలిపింది.. 2016-17 ఆర్థిక ఏడాదిలో రూ. 552.41 కోట్లు సెస్‌ రూపంలో వసూలైనప్పటికికీ గ్రామీణాభివృద్ధి నిధికి కేవలం రూ. 322.36 కోట్లు మాత్రమే బదలాయించారని కాగ్ పేర్కొంది. ఈ విధంగా గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కేటాయింపులు భారీగా ఉండ‌గా ఖ‌ర్చు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. కాగ్ నివేదిక బ‌హిర్గ‌తం కావ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు టీడీపీ తీరును ఎండ‌గడుతున్నారు. వారిపై అధికార పార్టీ నాయ‌కుల‌కు ఒక అస్త్రంగా మారింది.

రూ. 230.05 మేర నిధులను తక్కువగా బదలాయించారు.