Begin typing your search above and press return to search.

ఏపీలో మూడు పార్ల‌మెంటు స్థానాల్లో గెలుద్దాం.. బీజేపీ నేత‌ల వ్యూహం

By:  Tupaki Desk   |   3 Jun 2023 8:00 AM GMT
ఏపీలో మూడు పార్ల‌మెంటు స్థానాల్లో గెలుద్దాం.. బీజేపీ నేత‌ల వ్యూహం
X
ఏపీలో గెలిచి అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నా.. ఆదిశ‌గా క‌స‌ర‌త్తు అయితే.. చేయ‌ని బీజేపీ నేత‌లు.. ఇప్పుడు కీల‌క‌మైన మూడు పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. వారికి ఆది నుంచి అంతో ఇంతో క‌లిసి వ‌స్తున్న విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం, అదేవిధంగా బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు ఉన్న విజ‌య‌వాడ పార్ల‌మెంటు సీటు(ఇక్క‌డ గ‌తంలో తూర్పు నుంచి బీజేపీ అభ్య‌ర్థి, న‌టుడు కోట శ్రీనివాస‌రావు విజ‌యం ద‌క్కించుకున్నారు), అదేవిధంగా తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునేలా బీజేపీ పెద్ద‌లు బిగ్ ప్లాన్ ఏదో రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8న విశాఖలో బీజేపీ బహిరంగ సభ నిర్వ‌హించ‌నుంది. కేంద్రంలో అధికారం చేప‌ట్టి 9 సంవ‌త్స‌రాలు పూర్తియ‌న నేప‌థ్యంలో నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశానికి కేంద్రమంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు అమిత్‌షా రానున్నారు.

అలాగే 10న తిరుపతిలో బహిరంగ సభ నిర్వ‌హించ‌నున్నారు. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. విజ‌య‌వాడ‌లో కూడాఇలాంటి స‌భే నిర్వ‌హించ‌నున్నారు. అయితే.. డేట్ ఫిక్స్ కాలేదు.

ఇక‌, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి బీజేపీ నిర్ణయించింది. మే 31 నుంచి జూన్‌ 30 వరకూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1,000 మంది ప్రభావిత వ్యక్తుల వద్దకు వెళ్లి వివరించాలని నిర్ణయించారు.

అసెంబ్లీ నియోజక వర్గాల్లో బైకు ర్యాలీలు, సంయుక్త మోర్చాల సమ్మేళనాలు, గ్రామాల్లో రాత్రి బసలు, మండల స్థాయిలో 'మోడీ మిత్ర'తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్షేత్రంలోకి దిగింది.

ఈ నేప‌థ్యంలోనే మూడు పార్ల‌మెంటు స్తానాల‌పై దృష్టి పెట్టిన బీజేపీ నాయ‌కులు.. కార్య‌క్ర‌మాల‌కురెడీ అయ్యారు. మ‌రి ఏమేర‌కు వారి వ్యూహం ప‌నిచేస్తుందో చూడాలి.