Begin typing your search above and press return to search.

బీహార్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ట్రంప్ అడుగుతాడా ?

By:  Tupaki Desk   |   17 Oct 2020 5:00 PM GMT
బీహార్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ట్రంప్ అడుగుతాడా ?
X
బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. వరుసగా నాలుగోసారి అధికారం కోసం నితీశ్ నాయకత్వంలోని ఎన్ ‌డీఏ, ఈసారైనా అధికారంలోకి రావాలని ఆర్జేడీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలతో ఏర్పాటైన మహాగట్‌బంధన్‌ తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు ఇంజిన్ల ప్రభుత్వం నడుస్తోందని, అయినా కూడా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని , రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడటంలో నితీశ్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని అన్నారు. బిహార్ ‌కు ప్రత్యేక హోదా కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వచ్చి అడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగంతోపాటు నేరాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.

మేము అధికారంలోకి వస్తే మొదటి కేబినెట్ సమావేశంలోనే 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాం’ అని నిరుద్యోగాన్ని అతి ముఖ్యమైన అంశంగా యాదవ్ అభివర్ణించారు. తాము అధికారంలోకి వస్తే.. మొదటి శాసనసభా సమావేశాల్లోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని బిల్లును తీసుకొస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా హామీ ఇచ్చారు. ప్రతిపక్ష బీజేపీ ముగ్గురితో పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగిందని విమర్శించారు. ఓవైపు జేడీయూతోనూ, మరోవైపు చిరాగ్‌‌తోనూ, ఇంకో పక్క ఒవైసీతో పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇటీవల వరదలొచ్చి 18 జిల్లాలు జలమయమైతే కనీసం నష్టాన్ని అంచనా వేయడానికైనా కేంద్రం తన బృందాన్ని పంపించలేదని విమర్శించారు. ఎన్డీయే కూటమి నేతలు కేవలం అధికార దాహంతో ఉన్నారే తప్ప ప్రజల సమస్యలు వారికి కనిపించడం లేదని మండిపడ్డారు.

ఇకపోతే, బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, లెఫ్ట్ పార్టీలు 29 చోట్ల పోటీ చేస్తున్నాయి. అటు, అధికార ఎన్డీఏలో జేడీయూ 122, బీజేపీ 121 స్థానాల్లో పోటీకి ఒప్పందం కుదిరింది.