Begin typing your search above and press return to search.

మంత్రులు, ఎమ్మెల్యేలు గాంధీకి ఎందుకు రావట్లేదు?

By:  Tupaki Desk   |   30 Jun 2020 7:15 AM GMT
మంత్రులు, ఎమ్మెల్యేలు గాంధీకి ఎందుకు రావట్లేదు?
X
కొంత కాలం క్రితం కరోనా మొదలైన కొత్తలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు కేసీఆర్ ససేమిరా అన్నారు. అవి దోచుకుంటాయని.. ఎంత పేదలైనా.. డబ్బున్న వారైనా గాంధీ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతా ఉచితంగా చికిత్స చేస్తామన్నారు.

తెలంగాణలో కొంతమంది ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగానే వారంతా గాంధీ ఆస్పత్రికి రాలేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు. మీడియాలో ఈ వార్తలు హైలెట్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతిచ్చారు. అప్పటిదాకా కరోనా వైద్యం కేవలం గాంధీ ఆస్పత్రికేనన్న కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు రాగానే ఫ్లేట్ ఫిరాయించాడు.

ఇక డబ్బున్న వాళ్లు అంతా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కట్టేస్తున్నారు. డబ్బులేని పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను వివరణ అడగగా వింత సమాధానం చెప్పాడు. రాజకీయ నాయకులకు సొంత ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారని.. వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారని.. అందుకే ఆ ఫ్యామిలీ డాక్టర్స్ వద్దకే పోయి చికిత్స చేసుకుంటున్నారని బదులిచ్చారు. వీరి గురించి తెలియడంతో ఆ వైద్యులు వారికి బాగా చికిత్సనందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పరిధిలోనే గాంధీ ఆస్పత్రిలోనే వచ్చి చేరమని వారిని బలవంతం చేయలేము అని ఈటల రాజేందర్ బదులిచ్చాడు.

సోషల్ మీడియాలో దుష్ర్పచారాలు ఆపాలని.. గాంధీ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలున్నాయని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే పుకార్లను జనం నమ్మవద్దని ఈటల రాజేందర్ కోరారు.

ఇలా తెలంగాణలో నేతలు, అధికారుల ప్రైవేట్ వైద్యంపై ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణపై విమర్శలు చెలరేగాయి. గాంధీకే రావాలన్న ప్రభుత్వ మాట ఇక్కడ అభాసుపాలైందన్న వాస్తవాన్ని ఈటల అంగీకరించలేదని.. కొత్త కారణం చెప్పాడని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.