Begin typing your search above and press return to search.

‘పోస్టల్’ షాక్: కేసీఆర్ పై ఉద్యోగులకు ఎందుకంత కోపం?

By:  Tupaki Desk   |   4 Dec 2020 5:38 AM GMT
‘పోస్టల్’ షాక్: కేసీఆర్ పై ఉద్యోగులకు ఎందుకంత కోపం?
X
రైతులు, పింఛన్ దారులు, గ్రామస్థులను గుప్పిట పట్టిన కేసీఆర్ తెలంగాణలో విద్యా, ఉద్యోగులు, యువతను మాత్రం పెడచెవిన పెట్టారు. ఆరేళ్లు అవుతున్నా ఉద్యోగాల ప్రకటనలు సరిగా ఇవ్వడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతను కేసీఆర్ శాంతపరచలేదు. ఇప్పుడు ఉద్యోగులకు కూడా పీఆర్సీ, టీఏ, డీఏ సహా అన్నింటిని కేసీఆర్ ఎగ్గొట్టాడనే ఫిర్యాదులున్నాయి. ఇక కరోనా వేళ ఉద్యోగులకు సగం జీతం ఇచ్చి వారిని నొచ్చుకునేలా చేశాడు. అందుకే ఇప్పుడు ఉద్యోగులంతా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బకొట్టారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉద్యోగులను ఏ స్థాయిలో పీడించాడో అందరికీ తెలిసిందే. తర్వాత ఆయనకు వాళ్లే బుద్ధి చెప్పారనేది సుస్పష్టం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చేస్తోంది అదే. ఉద్యోగులతో పెట్టుకుంటేనే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి ఎదురైందనేది ఓ టాక్‌. వారితో పెట్టుకున్న పాపమే ఈ రిజల్ట్‌ అని బహిరంగంగా ఉద్యోగులు తిట్టిపోస్తున్నారు.

ఇటీవల రెవెన్యూ వ్యవస్థను భారీ ఎత్తున ప్రక్షాళన చేశారు. అందులో భాగంగా ఏకంగా వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికారు. ఆ నిర్ణయంతో తెలంగాణలోని అవినీతిని మొత్తం ఏరిపారేసినట్టు భారీ డైలాగులు కొట్టారు. సామాన్య ప్రజానీకంలో కొంతమంది ఈ నిర్ణయంతో సంతోషపడొచ్చు కానీ.. వారికిది ఓట్లు త్యాగం చేసేంత పెద్ద సంగతేం కాదు. అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధుగణం.. అందరూ కేసీఆర్‌‌కు బద్ద శత్రువుల్లా మారిపోయారు. తమ జీవితంలో ఇక టీఆర్‌‌ఎస్‌కు ఓటు వేసేది లేదంటూ డిసైడ్‌ అయిపోయారు. ఆ స్థాయిలో శత్రుత్వం పెంచుకున్నారు. ఇదంతా మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో చూపించారు కూడా.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. రెవెన్యూలో ఉన్న అసంతృప్తిని మున్సిపల్ ఉద్యోగులకు వరాలిచ్చి భర్తీ చేయాలని చూస్తోందని టాక్‌. పారిశుధ్య సిబ్బందికి అడక్కుండానే నెల జీతం 3 వేల రూపాయలు పెంచడాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా చూడాల్సి వస్తోంది. ఒక్క ఉద్యోగులకు వరాలిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అనుకున్నారేమో.. వరదసాయం మరో 100 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నారు. మీ సేవా కేంద్రంలో పేరు, ఇంటి నెంబర్, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇస్తే చాలు.. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఖాతాల్లో నేరుగా పరిహారం సొమ్ము జమ అవుతుందట.

అయితే ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు కేసీఆర్ ఏం చేయలేకపోయారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో టీచర్లనే కేసీఆర్ దూరంగా పెట్టడం సంచలనమైంది. వారు దెబ్బతీస్తారనే ఇలా చేసినట్టు తెలుస్తోంది. మొత్తం కేసీఆర్ కు జీహెచ్ఎంసీలో ఉద్యోగుల దెబ్బ పడిందనే చెప్పొచ్చు.