Begin typing your search above and press return to search.

సమ్మెపై కేసీఆర్ కాఠిన్యం వెనుక కారణమేంటి?

By:  Tupaki Desk   |   19 Nov 2019 6:15 AM GMT
సమ్మెపై కేసీఆర్ కాఠిన్యం వెనుక కారణమేంటి?
X
‘కంటపడ్డావా కనికరిస్తానేమో..వెంట పడ్డావా వేటడేస్తా ఓబా’ ఇదీ రాయలసీమ మాండలిక డైలాగ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ సినిమాలో సీమ పంతాలు, పౌరుషాలను తెలిపే డైలాగ్.. అయితే తెలంగాణ డైలాగ్ మాత్రం పూర్తి డిఫెరెంట్.. ‘కంటపడ్డా కనికరించం.. వెంటపడితే వేటాడిస్తాం’.. అంతే బై.. కేసీఆర్ తీరు ఇంతే బై.. తన మాట వినకుండా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు కేసీఆర్ వేటాడేస్తున్నారు..

ఆశలు చచ్చిపోయాయి. ఇన్నాళ్లు హైకోర్టు న్యాయం చేస్తుందని భావించిన ఆర్టీసీ కార్మికుల ఆశలు ఇప్పుడు అడియాశలయ్యాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో మేమేమీ చేయలేమని హైకోర్టు చేతులెత్తేసింది. చర్చలు జరపాలని కేసీఆర్ సర్కారును ఆదేశించలేమని.. సమ్మె చట్ట విరుద్ధమని అనలేమని స్పష్టం చేసింది. దీంతో ఇక లేబర్ కోర్టే కార్మికుల దిక్కు. ఉన్నది పోయి.. ఉంచుకున్నది పోయిన చందంగా కార్మికుల పరిస్థితి తయారైంది. కేసీఆర్ , కార్మిక సంఘాల పంతాలకు కార్మికులు బలైపోయిన ధైన్యం తెలంగాణలో హృదయవిదారకంగా ఉంది.

మొన్న 5వ తేదీ వరకు డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికులు అదరలేదు.. బెదరలేదు. పట్టించుకోలేదు. ఇప్పుడు సమ్మెపై హైకోర్టు చేతులెత్తేయడంతో వాళ్లు ఉద్యోగాల్లో చేరుదామని అంటున్నా కేసీఆర్ స్పందించడం లేదు. ఇలా పంతం నీదా నాదా అన్న రీతిలో సాగిన ఆర్టీసీ సమ్మెలో చివరకు కేసీఆర్ దే పైచేయిగా నిలిచింది.

ఇప్పటికీ విలీనాన్ని పక్కనపెట్టిన ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పుడు సమ్మె విరమించి చేరుదామని అంటున్నా కేసీఆర్ తీసుకునే పరిస్థితిలో లేరు. సమ్మెకు ముగింపు పలికే ఆలోచనే ఆయనకు లేదన్నది పరిస్థితి చూస్తే అర్థమవుతోంది..

తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగ సంఘాలంతా కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. రెవెన్యూను ఎత్తివేస్తామన్న ఆయన ప్రతిపాదన, పీఆర్సీ, ఫిట్ మెంట్ విషయంలో కొర్రీలు, జాప్యంతో సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేదన్నా మాట వినకుండా ముందుకు సాగారు. దీంతో కేసీఆర్ పంతానికి పోయారు. ఆర్టీసీ సమ్మెతో కార్మికులకు పట్టిన గతిని చూపించి మిగతా అధికారుల్లోనూ భయాన్ని కలుగుజేసే పరిస్థితికి తీసుకొచ్చారు. నిజానికి కేసీఆర్ వద్ద ఆర్థిక వనరులు లేని కారణంగానే సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఇప్పుడు ఈ సమ్మె దెబ్బకు అధికార యాంత్రాంగం కూడా కుక్కురు మనకుండా ఉండిపోవాల్సిన పరిస్థితిని కేసీఆర్ కల్పించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.