Begin typing your search above and press return to search.

అమిత్ షా ఏం చెప్తారు...ఏపీ జనాలు ఏమి వింటారు...?

By:  Tupaki Desk   |   10 Jun 2023 2:22 PM GMT
అమిత్ షా ఏం చెప్తారు...ఏపీ జనాలు ఏమి వింటారు...?
X
ఏపీకి రాక రాక వస్తున్న బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖలో ఆదివారం రాత్రి జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన ఏమి చెబుతారు అన్నది రాజకీయ వర్గాల నుంచి సామాన్య ప్రజల దాకా ఉత్కంఠ నెలకొంది. ఏపీకి తొమ్మిదేళ్ళలో బీజేపీ ఏమి చేసింది అన్న ప్రశ్న కూడా వస్తోంది.

బీజేపీ ఏపీకి ఢిల్లీని తలదన్నీ రాజధానిని కట్టించి ఇవ్వలేదు, విభజన హామీలు అలాగే ఉన్నాయి. ప్రత్యేక హోదాను తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజిలో పెట్టారు ఇక ఏపీకే ఘనతగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏకంగా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.

ఈ నేపధ్యంలో విశాఖ నుంచి ఏపీకి ఏమి చేశామని చెబుతారు అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఏపీకి కేంద్ర నిధులు ఇచ్చామని చెప్పవచ్చు. అవన్నీ కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పాటుగానే బీజేపీ ఏపీకి ఇచ్చింది తప్ప స్పెషల్ గ్రాంట్స్ ఏవీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.

ఏపీ ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఆదుకోమంటే అప్పులు చేసుకునే వెసులుబాటు అయితే గడచిన తొమ్మిదేళ్ళలో బీజేపీ కల్పించిందని అంటున్నారు. దాని వల్ల ఏపీ మరింతగా ఇబ్బందులు కావడం తప్ప ఏమీ ఒరిగేది లేదని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు, వారికి గెలుపు ఆశలు అయితే పెద్దగా లేవు. కానీ ఏపీలో ప్రధాన పార్టీలు అన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతూండడం వల్ల ఆ పార్టీకి రాజకీయంగా బేఫికర్ గా ఉండే సీన్ ఉంది.

దాంతో ఏపీకి ఏమి చేయకపోయినా ఫరవాలేదు అన్న వైఖరితో కాషాయం నేతలు ఉన్నారని అంటున్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ అన్నారు. అది ఏ పరిస్థితుల్లో ఉందో ఈ విజయోత్సవ వేళ చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ కొత్త రైలు మార్గాలు కానీ ఏవీ ఇవ్వలేదు.

విశాఖ సహా ఉత్తరాంధ్రా మూడు జిల్లాలు, రాయలసీమ నాలుగు జిల్లాలలో వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులను కూడా కేంద్రం తొలి మూడేళ్ళు ఇచ్చి ఆపేసింది. అలా జిల్లకౌ 50 కోట్లు వస్తున్న ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి ఆరేళ్ళుగా ఆ బకాయిలు అయితే ఉన్నాయి. వాటి ఊసే ఎత్తడంలేదు.

మరో వైపు ఏపీకి సంబంధించిన కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు అసలు పెద్దగాలేదని, దాని వల్ల అవి ఎప్పటికి పూర్తి అవుతాయో ఎవరికీ తెలియదు అంటున్నారు. ఇలా అనెక విషయాల మీద చూస్తే ఏపీకి బీజేపీ తీరని అన్యాయమే చేసిందని అంటున్నారు. అడగాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఊరుకోవడం వల్లనే ఇలా ఉందని అంటున్నారు.

బీజేపీ విజయోత్సవ సభల వేళ కేంద్రంలో మోడీ చేసిన ఘనకార్యాలు వల్లిస్తే ఉపయోగం ఏంటి ఏపీకి నిఖార్సుగా ఫలానా పని చేశాను అని చెప్పడం వల్లనే బీజేపీ రాజకీయంగా మనగలుతుందని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు. ఏది ఎమైనా అమిత్ షా ఏపీ ప్రజలకు ఏమి చెప్పబోతున్నారు అన్నదే ఇపుడు చూడాలని అంటున్నారు.