Begin typing your search above and press return to search.

రోశయ్య శిష్యుడి రూటెటు?

By:  Tupaki Desk   |   17 May 2022 1:36 AM GMT
రోశయ్య శిష్యుడి రూటెటు?
X
ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గంలో కీలక నేత.. ఆమంచి కృష్ణమోహన్‌. ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపు బావుటా ఎగురవేశారు. ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ (నవోదయం పార్టీ)గా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత నాటి అధికార టీ డీపీలో చేరారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని.. కాపులను అణగదొక్కుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గాన్ని సమీకృతం చేసే ప్రయత్నం కూడా చేశారు.

అయితే విచిత్రంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గాలి వీచినా చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్‌ ఓడిపోయారు. నాటి నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ చీరాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆధిపత్య పోరును ఎదుర్కొంటున్నారు.

చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాంకృష్ణమూర్తి తదనంతర పరిణామాల్లో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. ఇక టీడీపీలోనే ఎమ్మెల్సీగా కొనసాగిన పోతుల సునీత కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. సునీత చేనేత సామాజికవర్గానికి చెందినవారు. చీరాలలో అత్యధిక సంఖ్యలో చేనేతలు ఉన్నారు. దీంతో అటు ఆమంచి కృష్ణమోహన్, ఇటు కరణం బలరాం, ఇంకోవైపు పోతుల సునీత.. ముగ్గురూ చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నారు.

చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలు కూడా ఈ ముగ్గురు నేతల శిబిరాల్లో చేరిపోయారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. అధికారులు కూడా ఈ ముగ్గురు నేతల్లో ఎవరి మాట వినాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ అధిష్టానం తల పట్టుకుంది.

ఇక చివరికి మధ్యేమార్గంగా ప్రస్తుతం చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను అక్కడి నుంచి మార్చాలని జగన్‌ నిర్ణయించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించాలని జగన్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పర్చూరు ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ఈయన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో ఆమంచిని పర్చూరుకు పంపితే గట్టి అభ్యర్థి దొరికినట్టేనని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

పర్చూరులో వైఎస్సార్‌సీపీకి అభ్యర్థులు లేరు. ఎన్టీఆర్‌ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోయిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన అంత క్రియాశీలకంగా లేరు. దీంతో పర్చూరులో వైఎస్సార్‌సీపీకి ఇన్‌చార్జ్‌ లేని సమస్య ఉంది. ఈ నేపథ్యంలో ఆమంచిని అక్కడకు పంపడానికి జగన్‌ నిర్ణయించారు.

మరోవైపు ఆమంచి కృష్ణమోహన్‌కు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పవన్‌పై కొన్ని విమర్శలు చేసినప్పటికీ మరీ గీత దాటకుండా జాగ్రత్తపడ్డారు. కాగా ఆమంచికి పర్చూరు వెళ్లడానికి ఇష్టం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన పార్టీ ముఖ్యులకు తెలియజేశారని అంటున్నారు. మరి ఆమంచి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతారా లేదా జనసేనలో చేరతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.