Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి బ్రదర్స్ పితలాటకం.. కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   1 Aug 2021 2:51 PM GMT
కోమటిరెడ్డి బ్రదర్స్ పితలాటకం.. కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
X
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఫైర్ బ్రాండ్స్ గా చూస్తారు.. వైఎస్ అనుయాయులుగా కోమటిరెడ్డి సోదరులకు మంచి గుర్తింపు ఉంది. పదునైన విమర్శలు.. ధీటైన మాటలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో ముందుంటారు సోదరులు.. వైఎస్ క్యాబినేట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలు చేసి వెంకట్ రెడ్డి.. మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.. నల్గొండ జిల్లాలో జానారెడ్డి వంటి సీనియర్ నేత ఉన్నప్పటికీ తమ ప్రాభవాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ కు చేదు అనుభవాలే మిగిల్చాయి.

కాంగ్రెస్ ను ఏలాలని చూసిన కోమటిరెడ్డి బ్రదర్స్ భగ్గుమన్నారు. ఒకానొక దశలో అదిష్టానాన్ని ధిక్కరించినంత పనిచేశారు. ఇక రాజకీయాలు మాట్లాడేది లేదని..కేవలం తన భువనగిరి ఎంపీ నియోజకవర్గం పరిధికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూనే పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పార్టీని నమ్ముకొని త్యాగాలు చేసిన వారిని కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ఏంటని సూటిగానే ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తమ కుటుంబానికి పీసీసీ దక్కకపోవడంపై మొదట భగ్గమున్నారు. గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కాకరేపిన ఈయన ఇప్పుడు రేవంత్ రాకతో చల్లబడ్డారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయిందని.. సరైన నాయకత్వం లేకపోవడమే కారణమన్నారు.సోనియా, రాహుల్ గాంధీలు ఏ తప్పు చేయలేదని.. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా చేశారన్నారు. కొంత మంది స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కానీ,.. పోరాటం చేసే విషయంలో కానీ సరైన పద్ధతిలో పనిచేయకపోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్ బలహీనపడేలా చేశారని మండిపడ్డారు.

గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో.. ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంతోనే ఓడిపోయామన్నారు. అందుకే తాను కాంగ్రెస్ కు దూరం జరిగానని.. విభేదించానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్నానన్నారు.

ఇక రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ‘నేను రేవంత్ రెడ్డిని విమర్శించడం గానీ, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేయదలుచుకోలేదన్నారు. రెండు సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్న విషయం వాస్తమే కానీ.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

అయితే తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అధిష్టానంపై తమకేం కోపం లేదంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు పీసీసీ రాలేదన్న కోపంతో కొన్ని మాటలు అన్నానని.. వాటిని పట్టించుకోనవసరం లేదంటూ స్వయంగా ఆయనే తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కొత్త ట్విస్ట్.

తాజా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అటు అధికార టీఆర్ఎస్ తో.. ఇటు సొంత పార్టీ కాంగ్రెస్ పై కత్తులు దూస్తూనే ఉన్నారు. ఇలా అన్న కాస్త మెత్తబడినా.. తమ్ముడు మాత్రం తగ్గేది లేదంటూ అసమ్మతి రాజేస్తున్నారు. వీళ్లిద్దరూ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఒప్పుకున్నారా లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.