Begin typing your search above and press return to search.

అమలాపురంలోని ఆ 15 గంటలు ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   25 May 2022 3:49 AM GMT
అమలాపురంలోని ఆ 15 గంటలు ఏం జరిగింది?
X
ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా పేరున్న పట్టణం అమలాపురం. ఆవేశానికి దూరంగా అతిధ్యానికి దగ్గరగా.. కోనసీమ అందాలకు నెలవుగా చెప్పుకునే అమలాపురం.. తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన తీరును ప్రదర్శించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడి ప్రజలు ఇంతలా ఆవేశ పడిపోవటానికి.. ఇంత భారీ ఆందోళనకు తెర తీయటమే కాదు.. పోలీసుల లాఠీలను లెక్క చేయకుండా.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రజాప్రతినిధుల ఇళ్లను నిప్పు పెట్టేసిన అరుదైన పరిస్థితికి కారణమైంది అమలాపురం.

కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ తీసుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. 'కోనసీమ జిల్లా సాధన సమితి' పేరుతో మంగళవారం చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. వాట్సాప్ గ్రూపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి... తాము నిర్వహించాలని భావించిన ఆందోళన కార్యక్రమాన్ని అందులో షేర్ చేశారు. అయితే.. చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిలువరించేందుకు సోమవారం నుంచే జిల్లా కేంద్రమైన అమలాపురంలో భారీగా మొహరించిన పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు.

అయితే.. ఈ ఆంక్షల్ని లెక్క చేయని ఆందోళనకారులు పెద్ద ఎత్తున గడియార స్తంభం వద్దకు చేరుకోవటం.. 'కోనసీమ పేరే ముద్దు.. మరే పేరూ వద్దు' అంటూ నినాదాలు చేశారు. ఇలా మొదలైన ఆందోళన.. కొన్ని గంటల వ్యవధిలోనే అదుపు తప్పిపోవటమే కాదు.. మంత్రికి చెందిన రెండు ఇళ్లు (ఒకటి నిర్మాణంలో ఉన్నది).. ఎమ్మెల్యేకు చెందిన ఇంటిని నిరసనకారులు నిప్పు పెట్టటంతో పాటు.. పట్టణం మొత్తం అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

కనివిని ఎరుగని రీతిలో చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు.. అధికారులు నిర్ఘాంతపోయిన పరిస్థితి. పోలీసులు లాఠీలు ఝుళిపిస్తే.. అందుకు ప్రతిగా పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన ఆందోళనకారుల కారణంగా వంద మందికి పైగా పోలీసు అధికారులకు.. సిబ్బందికి గాయాలు అయ్యాయి. చివరకు జిల్లా ఎస్పీ సైతం గాయాల బారిన పడిన వైనాన్ని చూస్తే.. పరిస్థితి ఎలా ఉందన్నది అర్థం కాక మానదు.

అనూహ్య పరిణామాలకు దారి తీసిన చలో కలెక్టరేట్ కార్యక్రమం చివరకు హింసాత్మక చర్యలు చోటు చేసుకునే వరకు వెళ్లటం గమనార్హం. ఉదయం 7 గంటలకు మొదలైన ఉద్రిక్తత.. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం వేళలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చివరకు రాత్రి 10 గంటల ప్రాంతానికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ.. అమలాపురం మాత్రం లోలోన రగులుతూనే ఉంది. ప్రస్తుతానికి నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ హాట్ కండీషన్ స్థానే ఎప్పటిలా ప్రశాంత వాతావరణం ఎప్పటికి నెలకొంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇంతకీ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల (మొత్తం పదిహేను గంటలు) వరకు ఏం జరిగిందన్నది చూస్తే..

ఉదయం 7.00: చలో కలెక్టరేట్ ఆందోలన నేపథ్యంలో అమలాపురం అంతటా 144 సెక్షన్‌ విధింపు
ఉదయం 10.00 : పట్టణం చుట్టూ పోలీసుల మోహరింపు.. బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు
ఉదయం11.00 : పట్టణమంతటా కర్ఫ్యూ వాతావరణం.. అడుగడుగునా తనిఖీలు
మధ్యాహ్నం 12 : పోలీసుల నియంత్రణతో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తత
మధ్యాహ్నం 1.30 : అప్పటివరకు స్తబ్దుగా ఉన్న వీధుల్లోకి వచ్చిన ప్రజలు
మధ్యాహ్నం 2.30 : జేఏసీ ర్యాలీ విఫలమైందన్న ఆనందంలో పోలీసులు
మధ్యాహ్నం 3.00 : అనూహ్యంగా 3 వేల మంది అమలాపురం పట్టణంలోకి ప్రవేశం. అడ్డుకునేందుకు లాఠీ ఛార్జీ
మధ్యాహ్నం 3.30 : జిల్లా ఎస్పీ వాహనంపై దాడి.. పోలీసుల వజ్ర వాహనంపై దాడి
సాయంత్రం 4.30 : కలెక్టరేట్‌ వద్ద బస్సుకు నిప్పు
సాయంత్రం 4.40 : వరుసగా పోలీసులు.. వారి వాహనాలపై రాళ్ల దాడి
సాయంత్రం 5.30 : మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి.. ఫర్నిచర్‌కు నిప్పు
సాయంత్రం 6.10 : మంత్రి విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయం పైనా దాడి
సాయంత్రం 6.20 : ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ ఇంటిపై దాడి
రాత్రి 7.30 : అదనపు బలగాల రాక
రాత్రి 8.00 : ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు.. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆగమనం
రాత్రి 9.30 : పరిస్థితిని అదుపులోకి తెచ్చిన బలగాలు
రాత్రి 10 : అనూహ్య పరిణామాల మధ్య నివురుగప్పిన నిప్పులా అమలాపురం