Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ జనసేన ఫ్లెక్సీ వార్.. రచ్చ రచ్చగా మారింది!

By:  Tupaki Desk   |   30 May 2023 12:00 PM GMT
వైసీపీ వర్సెస్ జనసేన ఫ్లెక్సీ వార్.. రచ్చ రచ్చగా మారింది!
X
ఫ్లెక్సీ వార్ ఏపీలో హీటెక్కిస్తోంది. అధికార వైసీపీ.. జనసేన అభిమానుల మధ్య ఫ్లెక్సీ రచ్చ అంతకంతకూ ముదురుతోంది. పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన గొడవలు.. ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఈ ఫ్లెక్సీ వార్ దెబ్బకు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి మారింది. టీడీపీ.. జనసేనకు వ్యతిరేకంగా వైసీపీకి చెందిన అభిమానులు పలువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు పల్లకిని పవన్ కల్యాణ్ మోస్తున్నట్లుగా సిద్ధం చేసిన బ్యానర్లు.. ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటికి పేదలకు.. పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ కొటేషన్లు ఉన్నాయి.

దీనికి ప్రతిగా జనసేన అభిమానులు రాక్షస పాలన అంతం.. ప్రజా పాలన ఆరంభం అంటూ కౌంటర్ ఫ్లెక్సీలు వేశారు. దీంతో.. రెండు పార్టీలకు చెందిన అభిమానులు.. మద్దతుదారుల మధ్య గొడవలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

కొన్నిచోట్ల వైసీపీకి చెందిన వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే. వాటికి కౌంటర్ గా ఫ్లెక్సీలను జనసేన సిద్ధం చేసింది. దీంతో.. ఇరు వర్గాల మధ్య పంచాయితీ చోటు చేసుకోవటం.. ఈ గొడవలో ఎంట్రీ ఇస్తున్న పోలీసులు.. మున్సిపల్ సిబ్బంది జనసేన వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన బ్యానర్లు.. ఫ్లెక్సీలను వదిలేస్తున్నారు.దీనిపై జనసేన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిలదీస్తున్నారు.

ఏపీలో ఫ్లెక్సీ వార్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో విశాఖ.. పాలకొల్లు.. ఒంగోలు.. నాయుడు పేటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇరు పార్టీలకు చెందిన వారి మధ్య గొడవలకు కారణమవుతోంది. జనసేన ఏర్పాటు చేసిన కౌంటర్ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారని.. అధికారులు సైతం వైసీపీ బ్యానర్లను అలానే ఉంచేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.

మున్సిపల్ సిబ్బంది. .పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా జనసైనికులు ఆందోళనకు దిగారు. పాలకొల్లులో వైసీపీ - జనసేన ఫ్లెక్సీ వార్ మరింత ముదిరింది. పవన్ కల్యాణ్ ను కించపరిచేలా వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై జనసైనికులు ఆందోళనకు దిగి.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పవన్ ను కించపరిచేలా వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నిరసన చేపట్టారు. అయినా.. పోలీసులు స్పందించటం లేదంటే వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.